నర్సంపేటరూరల్, జూన్ 17: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం లాంటిదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ముత్యాలమ్మతండా పరిధిలోని జంగాలపల్లితండాలో శనివారం గిరిజనోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పెద్ది హాజరై బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తండాల అభివృద్ధికి, గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని తండాల్లో 80 శాతం బీటీరోడ్లు నిర్మించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్కు ప్రజలు రుణపడి ఉండాలన్నారు. గిరిజనులకు 6 నుంచి 12 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని, పోడు వ్యవసాయం చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ వందశాతం పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 నుంచి చేపట్టనుందన్నారు. గిరిజన విద్యార్థుల కోసం గిరిజన సైనిక్స్కూల్, గిరిజన పాఠశాల, కళాశాలలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గిరివికాస్ పథకం ద్వారా రూ. 2 కోట్లతో గిరిజనులకు బోర్వెల్ సహాయంతో సాగునీరు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తండాల్లో 56 జీపీల ఏర్పాటు
నర్సంపేట నియోజకవర్గంలో గతంలో 103 గ్రామ పంచాయతీలు ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 56 తండాలను ప్రత్యేక జీపీలుగా ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది గుర్తుచేశారు. గిరిజన కుటుంబాల వివాహాది శుభకార్యాల కోసం రూ. 2 కోట్లతో నర్సంపేట ప్రాంతంలో ఏసీతో కూడిన గిరిజన భవనాన్ని నిర్మిస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే పెద్దిని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, ఎంపీడీవో అంబాల శ్రీనివాసరావు, సర్పంచ్లు భూక్యా సైద, దస్రూ, స్వాతి, ఎంపీటీసీలు భూక్యా వీరన్న, బదావత్ వీరన్న, ఏఈ చందర్, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్రెడ్డి, ఉప సర్పంచ్ రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మచ్చిక నర్సయ్యగౌడ్, భూక్యా రాజేందర్నాయక్, ఈర్య పాల్గొన్నారు.
మండలంలో ఘనంగా వేడుకలు
మండలంలోని అన్ని గిరిజన తండాల్లో గిరిజనోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కొబ్బరికాయలు కొట్టి ఉత్సవాలను నియమనిష్టలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తండా పెద్దలను ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. భోజ్యానాయక్తండాలో సేవాలాల్ బోగ్బండార కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సర్పంచ్ భూక్యా లలిత, బీఆర్ఎస్ మండల నాయకుడు భూక్యా వీరన్ననాయక్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో తండాపెద్దలు, ప్రజాప్రతినిధులు ఈర్య, తప్సీ, రాజు, రాజేందర్, రమేశ్, రూప్సింగ్, సమ్మయ్య, వీరన్న, తిరుపతి, సుమన్ పాల్గొన్నారు.
తండాలను జీపీలు చేసిన ఘనత సీఎందే..
ఖానాపురం: తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అన్నారు. మండలవ్యాప్తంగా అన్ని తండాల్లో గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేపచెట్టుతండాలో జరిగిన గిరిజన వేడుకల్లో గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి సేవాలాల్కు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పాల్గొని తండాలోని సీనియర్ సిటిజన్లను శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తండాలు జీపీలుగా మారడంతో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ఎంతో తోడ్పాటునందిస్తున్నదన్నారు. గిరిజనులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, సర్పంచ్ భూక్యా పద్మ, వెంకన్న, ఉపసర్పంచ్ దేవేందర్, అనిత, రెడ్యానాయక్, రమేశ్, బుచ్చానాయక్, హేమా లక్ష్మణ్ పాల్గొన్నారు.
14 గిరిజన జీపీల్లో కార్యక్రమాలు
చెన్నారావుపేట: మండలంలోని 14 గిరిజన గ్రామ పంచాయతీల్లో గిరిజనోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ ఆరాధ్య దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యదర్శులు, సర్పంచ్ల ఆధ్వర్యంలో తండాల్లో జరిగిన అభివృద్ధిపై ప్రగతి నివేదికలను గ్రామస్తులకు చదివి వినిపించారు. కల్నాయక్తండాలో ప్రత్యేక అధికారి దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, గిరిజనులను పరిపాలనలో భాగస్వాములను చేసిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రజితా వీరన్నానాయక్, వార్డు సభ్యులు సుజాత, వనిత, అనిత, కార్యదర్శి వికాస్ తదితరులు పాల్గొన్నారు.