హాహా…చ్! రోజుకు ఒక్కసారన్నా ఇది వినకుండా బండి సాగదు వానాకాలంలో. ఆ శబ్దం అవతలి వాళ్లదా, మనదేనా అన్నది అప్రస్తుతం. అసలు ప్రస్తుతమేంటీ అంటే… ఎవరితో మాట్లాడినా బుర్రకథలా వినిపించే జ్వరాల సంగతులు. ఇవేం సంగీతంలో సంగతుల్లా ఆహ్లాదంగా ఉండకపోయినా.. ఈ కాలాన్ని బట్టి వినక తప్పదు. మాత్ర, టానిక్, పథ్యం, పండ్లు, వేడి నీళ్లు.. ఇవే ఈ కాలపు ట్రెండింగ్ పాస్వర్డ్లు. అలాగని, వానను చూసి ఇంట్లోనే తల మీద దుప్పటి కప్పుకొని కూర్చోవడం అందరికీ సాధ్యమయ్యే పనీకాదు. అందుకే రోగనిరోధక శక్తికి పదును పెట్టాలి. వ్యాధుల కాలాన్ని ధైర్యంగా దాటాలి. మరి దాని కోసం శరీరాన్ని ఎలా సన్నద్ధం చేసుకోవాలి.. అసలేం తినాలి.. ఎలా ఉండాలి!!
రోగనిరోధకశక్తి అంటే మన శరీరానికి ఒక రక్షణ వ్యవస్థ. అచ్చం బార్డర్లో సైనికుడిలా. వ్యాధికార క్రిముల్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడంతో పాటు వచ్చిన వాటితోనూ పోరాడతాయీ కణాలు. అవి బలహీనపడితే మనం జబ్బుల బారిన పడతాం. కాబట్టి ఇమ్యూనిటీకి బలాన్ని ఇవ్వడం చాలా ముఖ్యం. అప్పుడు బయటి నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్లాంటి సూక్ష్మజీవులతో పాటు ఈ కాలంలో నీళ్ల ద్వారా వ్యాప్తి చెందే అనేక జబ్బుల నుంచి రక్షణ పొందొచ్చు. అదెలాగో చూద్దాం…
సహజంగా ఇమ్యూనిటీ అనేది రెండు రకాలు. మొదటిది సహజ ఇమ్యూనిటీ. ఇది మనం తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడే ఉంటుంది. సహజంగా మనకు ఎదురుపడే రకరకాల సూక్ష్మ జీవులతో పోరాడేందుకు ఇది తోడ్పడుతుంది. ఎన్నో రకాల జబ్బుల నుంచి మనల్ని కాపాడుతుంది. రెండోది అక్వైర్డ్ ఇమ్యూనిటీ… అంటే ఆర్జిత రోగనిరోధకత. దీన్ని మన శరీరం సంపాదించుకుంటుందన్నమాట! ఉదాహరణకు ఒకసారి ఆటలమ్మ పోస్తే అది మళ్లీ రాదు. అంటే శరీరంలో దానికి సంబంధించిన యాంటీబాడీలు తయారై ఉంటాయి.
రకరకాల వ్యాధులు రాకుండా వేసే టీకాలు కూడా ఈ కోవలోవే. ఇక, వానాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. వైరస్, బ్యాక్టీరియాల్లాంటి సూక్ష్మజీవుల వృద్ధికి ఇది అనుకూల సమయం. అవి మన రోగనిరోధక వ్యవస్థ మీద దాడి చేసినా ప్రతిఘటించేందుకు సిద్ధంగా మన శరీరాన్ని సన్నద్ధం చేసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మొట్టమొదటి దారి నిద్ర. మనం పడుకున్నప్పుడు శరీరంలో లక్షల కణాలు పునరుత్పత్తి అవుతుంటాయి. అలాగే రోజంతా పోరాడిన రోగనిరోధక వ్యవస్థ ఈ సమయంలోనే రిపేర్ అవుతుంది. మరుసటి రోజుకి అది సన్నద్ధమయ్యే సమయం ఇదే. కాబట్టి 7 నుంచి 8 గంటల చక్కటి నిద్ర శరీరానికి అత్యవసరం.
మన శరీరానికి వ్యాయామం చాలా అవసరం. దాని వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అప్పుడు దానితో పాటు రోగనిరోధక కణాలు శరీరమంతా చక్కగా ప్రయాణించగలుగుతాయి. అందువల్ల నడక, పరిగెత్తడం లేదా ఇతర ఏవైనా చిన్నా పెద్దా వ్యాయామాలు చేయడం అన్నది మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ప్రధాన మార్గాలు.
రోగనిరోధక శక్తి వృద్ధిలో పరిశుభ్రత చాలా ముఖ్యం. చుట్టూ చెమ్మ, మురికి ఉండే వానాకాలంలో దీన్ని పాటించడం ఎంతో అవసరం. అందుకే తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అన్నం తినడానికి ముందు, ఏవైనా అపరిశుభ్రమైనవి తాకినప్పుడు…ఇలా. ఇక, చర్మం నుంచి కూడా వైరస్ లోపలికి వెళ్లొచ్చు. అంటే మనం ఒకదాన్ని పట్టుకొని తర్వాత ఆ చేతిని నోటికి తగిలించినా అవి లోపలికి వెళతాయనే విషయాన్నీ గమనించుకోవాలి.
స్ట్రెస్ ఎక్కువైతే కార్టిసోల్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. దానివల్ల రోగనిరోధక కణాల పనితీరు తగ్గుతుంది. కాబట్టి దాన్ని నియంత్రించడానికి ప్రాణాయామం, ధ్యానంలాంటివి చేయాలి.
ఇమ్యూనిటీని పెంచేందుకు ఆహారంలో కొన్ని సుగుణాలు చాలా ప్రధానం. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్… అంటే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బయాటిక్ గుణాలు ఉన్న ఆహారం ఇందుకు అవసరం. వెల్లుల్లిలో యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అల్లం, పసుపుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి కాక మరికొన్ని లక్షణాలున్న ఆహారాలూ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరం.
పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, దాల్చిన చెక్కలాంటివి రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. టీలు, లేదా కూరలు లేదా ఇతర ఆహారంలోనైనా వీటిని జత చేసుకోవాలి. ఈ ఆహారాలకు యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అంటే సూక్ష్మ జీవులకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి.
తాజా పండ్లలో విటమిన్-సి, జింక్ బాగా దొరుకుతాయి. నారింజ, బత్తాయిలాంటి నిమ్మజాతి పండ్లు, ఉసిరి, జామ, దానిమ్మలు ఇందులో ప్రధానంగా చెప్పొచ్చు. ఇవి తెల్ల రక్తకణాల తయారీకి సహకరిస్తాయి. ఆ కణాలు బయటి నుంచి వచ్చే సూక్ష్మ జీవులతో పోరాడతాయి. అవిసె, గుమ్మడిలాంటి గింజలన్నింటిలోనూ ఇవి పుష్కలంగా ఉంటాయి.
రోగనిరోధక వ్యవస్థకు చెందిన 70 శాతం కణాలు పొట్ట భాగంలోనే ఉంటాయి. అందుకే జీర్ణవ్యవస్థను భద్రంగా చూసుకోవాలి. అక్కడి మంచి బ్యాక్టీరియాకు బలాన్నిచ్చేలా పులిసిన ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. అందుకోసం పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, చద్దన్నంలాంటివి తీసుకోవచ్చు.
శరీరానికి నీరు ఎంత బాగా అందితే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఈ కాలంలో తప్పకుండా శుద్ధి చేసిన నీళ్లే తాగాలి. ఫిల్టర్ నీళ్లు, లేదా కాచి చల్లార్చిన నీళ్లను ఇందుకోసం ఎంచుకోవాలి. పండ్ల ద్వారా కూడా కొంత నీరు అందుతుంది. సూప్స్లాగానూ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో వెచ్చగా ఉండే ఆహారం తినడం ముఖ్యం. దాని వల్ల గాలి, నీళ్ల ద్వారా గొంతు భాగంలో పేరుకుపోయిన సూక్ష్మ జీవులు చనిపోతాయి. అందుకే టమాటా, దాల్, మిక్స్డ్ వెజిటబుల్లాంటి సూప్లతో పాటు నాన్ వెజిటేరియన్లయితే బోన్ సూప్లాంటివీ తీసుకోవచ్చు.