నర్సంపేట, జూలై 6 : ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు ముందే బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి నర్సంపేటలోని బీజేపీ కార్యాలయంపై సొంత పార్టీ నేతలే దాడులు చేసి అద్దాలు, కుర్చీలు విరగ్గొట్టారు. సాక్ష్యాత్తు ఈ లొల్లి అంతా పార్టీ పర్యవేక్షకుడు, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ఎదుటే జరిగింది. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, గోగుల రాణాప్రతాప్రెడ్డి వర్గాలు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. ఎవరికి వారే పోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 8న మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రేవూరి గురువారం బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. దీనికి మాజీ ఎంపీ జితేందర్రెడ్డి హాజరయ్యారు.
సమావేశం జరుగుతున్న క్రమంలో అక్కడికి రాణాప్రతాప్రెడ్డి వర్గానికి చెందిన తడుక అశోక్ తదితరులు 20 మంది వచ్చి మాజీ ఎంపీతో మాట్లాడారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమకు రేవూరి వచ్చినప్పటి నుంచి పార్టీకి సంబంధించిన ఏ సమాచారం ఇవ్వడం లేదని, ఈ మీటింగ్ కూడా తమకు తెలియదని, తాము బీజేపీలో ఉన్నామా? లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధానం చెప్పేలోపే కొందరు నాయకులు అక్కడే ఉన్న కుర్చీలను విరగ్గొట్టారు. కార్యాలయ అద్దాలను పగులగొట్టారు. దీంతో పార్టీ ఇన్చార్జి జితేందర్రెడ్డి గెస్ట్హౌస్కు రండి.. అక్కడ మాట్లాడుకుందాం అంటూ అక్కడి నుంచి వెళ్లబోగా, తామెందుకు అక్కడికి వస్తాం.. ఇక్కడే చెప్పాలంటూ కార్యకర్తలు పట్టుబట్టారు. దీంతో రేవూరి వర్గం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రవీందర్ ఘటనా స్థలానికి చేరుకునేలోపే లొల్లికి దిగిన నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రెండుగా చీలిన నర్సంపేట బీజేపీ..
నర్సంపేటలో బీజేపీలో పనిచేస్తున్న కొందరు నాయకులు గోగుల రాణాప్రతాప్రెడ్డి వెంట ఉన్నారు. బీజేపీలో రేవూరి ప్రకాశ్రెడ్డి చేరడంతో ఆయనతోనూ కొంత మంది నేతలు పనిచేస్తున్నారు. ఇక్కడ రెండు వర్గాలుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం రెండు వర్గాలు పంచాయితీ తారాస్థాయికి చేరుకున్నది. కొన్ని నెలలుగా పోటీ కార్యక్రమాలతో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మోదీ పర్యటనకు ముందు వర్గాల కుమ్మలాట పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అయితే రెండు వర్గాలకు రాష్ట్ర స్థాయి నేతల మద్దతు ఉండడంతో తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు.