పీవీకి కేంద్రప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఆయన స్వగ్రామం వంగరలో అభిమానులు, గ్రామస్తులు సంబురాలు జరుపుకొన్నారు. ఆయనకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామం, వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లితో అనుబంధం ఉంది. పీవీ నర్సింహారావు లక్నేపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో రుక్మిణీదేవి-సీతారామారావు దంపతులకు 1921 జూన్ 28న జన్మించారు. పీవీకి ఇద్దరు తమ్ముళ్లు మాధవరావు, మనోహర్రావు, సోదరి సరోజినీదేవి ఉన్నారు. పీవీ అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని అయ్యారు. మారుమూల గ్రామంలో పుట్టి దేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి ఆయన. పీవీ నర్సింహారావు చనిపోయిన పదిరోజులకే సోదరి సరోజినీదేవి కూడా మృతి చెందారు. ఆయనను కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పీవీకి అరుదైన గౌరవాన్ని కల్పించారు. కేసీఆర్ ప్రభుత్వం పీవీ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించింది.
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషాకోవిదుడు, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి మాజీ ప్రధాని దివంగత పాములపర్తి వెంకటనర్సింహారావుకు అత్యున్నత పురస్కారం లభించింది. ఆయన అభిమానుల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేస్తూ కేంద్రప్రభుత్వం శుక్రవారం పీవీకి భారతరత్న అవార్డు ప్రకటించగా ఆయన స్వగ్రామం వంగరలో సంబురం అంబరాన్నంటింది. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన పీవీని నాడు కాంగ్రెస్ పాలకులు విస్మరించినా స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు సముచిత గౌరవం ఇచ్చింది. జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడంతో పాటు శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు పండుగలా చేసి ప్రత్యేక స్థానం కల్పించింది. తాజాగా కేంద్రం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ హర్షం వ్యక్తంచేశారు.
పీవీ తన సన్నిహితుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి 1944లో కాకతీయ పత్రికను వరంగల్ జిల్లాలో స్థాపించారు. 1946-1955 వరకు వార పత్రికను కొనసాగించారు. ఇందులో గొల్లరామవ్వకథ, నీలిరంగు పట్టుచీర, మంగయ్యజీవితం లాంటి రచనలు అప్పటి సామాజిక జీవనానికి అద్దం పట్టాయి. పీవీ రచించిన ఆర్తగీతికలు కాకతీయ పత్రికలో ప్రచురితమయ్యాయి. పీవీ రాసిన తన ఆత్మకథ ‘లోపలి మనిషి’లో భారతదేశ చరిత్ర, హైదరాబాద్ సంస్థానంలోని విశిష్టమైన అంశాలను, జరిగిన పరిణామాల గురించి వివరించారు.
పీవీ బహుభాషా కోవిదుడు. నిజాంకాలంలో చదువుకున్న వారికి తెలుగు, హిందీ, ఇంగ్లిషు, ఉర్దూ భాషల్లో సహజంగా ప్రావీణ్యం ఉంటుంది. పీవీకి మాత్రం 17 భాషల్లో ప్రావీణ్యం ఉంది. తెలుగు, మరాఠీ, హిందీ, ఇంగ్లిషు, తమిళం, ఫ్రెంచ్ భాషల్లో ప్రావీణ్యం ఉందని చెబుతారు. మరాఠీ నవలలను తెలుగులోకి, తెలుగు గ్రంథాలను హిందీలోకి అనువాదం చేశారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలును సహస్రఫణ్ పేరుతో హిందీలోకి అనువాదం చేశారు. హరినారాయణ్ ఆప్టే మరాఠీ ప్రసిద్ధ నవల ‘పాన్లక్షత్ కోన్ఘెటా’ను పీవీ అబల జీవితం పేరుతో తెలుగులో అనువదించారు.
వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం మొదలుపెట్టారు. హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. కళాశాల చదువు కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ వందేమాతరం ఆలపించడంతో సహచరులతో పాటు పీవీని విశ్వవిద్యాలయం నుంచి అప్పటి నిజాం ప్రభుత్వం బహిష్కరించింది. నిజాం ఏలుబడిలోని ఏ ప్రాంతంలోనూ చదివేందుకు వీలు లేదని అప్పటి ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో మహారాష్ట్రలోని నాగపూర్లో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తిచేశారు. విద్యార్థి దశ నుంచే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కొంతకాలం అజ్ఞాతవాసం ఉండి చాందా క్యాంపులో క్రియాశీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు.
పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలు దివాళా స్థాయికి చేరుకుని ఆర్థికవ్యవస్థ పూర్తిగా దిగజారింది. ఆ సమయంలో పీవీ తన శక్తియుక్తులు, రాజకీయ చతురతతో సరళీకృత ఆర్థిక విధానం ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థకు గాడిన పడేసి పునరుజ్జీవం కల్పించారు. దీంతో పీవీకి ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు వచ్చింది. పంజాబ్ తీవ్రవాదాన్ని అణచివేసిన ఘనత కూడా పీవీకే దక్కుతుంది. దేశంలో అణుపరీక్షలు మొదలు పెట్టింది పీవీ సర్కారే. పీవీపై గౌరవంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఏకంగా కేంద్ర మానవ వనరుల శాఖను ఆయన కోసమే ఏర్పాటు చేశారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను పీవీ ప్రజల కోసం వినియోగించారు.
సమైక్య రాష్ర్టానికి పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1972 ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర రజతోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా అర్ధరాత్రి జరిగిన శాసనసభలో పీవీ ఉద్వేగభరితంగా గీతాన్ని ఆలపించారు.‘ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుం జముగ వెలుగుటే నా తపస్సు, వెలిగించుట నా ప్రతిజ్ఞ..!’ అనడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల చప్పట్లతో సభ మార్మోగింది.
పీవీ నరసింహారావు ఇంటిని అతని కుటుంబసభ్యులు మ్యూజియంగా మార్చారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పీవీ ఇల్లు ఉంది. పీవీ భారత ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన వినియోగించిన వస్తువులను, ఫొటోలను పదిలపరిచారు. నర్సింహా రావు ఫొటోలను ప్రత్యేక గ్యాలరీగా అమర్చారు. ఆయన ప్రధానిగా దేశ, విదేశాల్లో చేపట్టిన కార్యక్రమాలు ఫొటో గ్యాలరీలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పీవీ వినియోగించిన కారు ఇంటి ఆవరణలో ప్రదర్శనకు ఉంచారు. పీవీ ఇంటి ఎదుట అతడి కాంస్య విగ్రహం ఏర్పాటుచేశారు. ఏటా పీవీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అతని కుటుంబసభ్యులు ఇక్కడే నిర్వహిస్తారు.
యావత్ జాతి మరువలేని నేత మన పీవీ. దేశ ఆర్థిక వ్యవస్థను ఆయువుపట్టుగా నిలిపాడు. పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలనే ప్రస్తుతం దేశం అనుభవిస్తున్నది. ఆయనకు భారతరత్న రావడం దేశ, రాష్ట్ర ప్రజలకు గర్వకారణం. పీవీ పుట్టిన గడ్డకు ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ప్రపంచం గర్వించదగ్గ నేత పీవీ. సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల పారిశ్రామిక రంగంలో ఎన్నో పెట్టుబడులు వచ్చాయి. కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. పీవీ లేని దేశాన్ని ఊహించుకోలేం. పీవీతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. పీవీకి భారతరత్న రావడం, ఆయన మన ప్రాంత ముద్దుబిడ్డ కావడం నిజంగా గర్వకారణం.
పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో మన దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం మైనార్టీలో ఉన్నప్పటికీ పీవీ నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక ప్రగతిని గాడిన పెట్టారు. ప్రాంతాన్ని కాకుండా దేశాన్ని ఒక కుటుంబంగా చూసిన మహనీయుడు. పీవీకి భారతరత్న ప్రకటించిన ప్రధాని మోదీకి అభినందనలు.
జనగామ, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : పీవీకి భారతరత్న ప్రకటించడం గర్వకారణం. పలుమార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రాన్ని కోరడమే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. పీవీ కూతురు వాణీదేవికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ట్యాంక్బండ్పై పీవీ విగ్రహం, నెక్లెస్ రోడ్కు పీవీ మార్గ్గా నామకరణం, అసెంబ్లీలో చిత్రపటం ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్దే. కేసీఆర్కు, కేంద్రానికి ధన్యవాదాలు.
నర్సంపేట రూరల్: పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించడం గర్వించదగిన విషయం. నర్సంపేట నియోజకవర్గంలోని మారుమూల లక్నేపల్లిలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి దేశానికి ప్రధాని అయ్యారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేశాం. బలపరిచే అవకాశం నాకు దక్కింది.
దేశాన్ని సంస్కరించిన మహనీయుడు పీవీ. ఆయనకు గ్రూపు రాజకీయాలు రావు. ప్రజలే ఆయన గ్రూపు. అందుకే ఉమ్మడి ఆంధ్ర రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయిండు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో పీవీ శత జయంతి ఉత్సవాలు జరిగాయి. పీవీ జీవిత చరిత్రను ప్రపంచవ్యాప్తం చేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు.