తాడ్వాయి, ఫిబ్రవరి 4 : వనదేవతలు కొలువైన మేడారం జాతర పరిసరాలు జనసంద్రంగా మారా యి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో అరణ్యంగా ఉన్న మేడారం జనారణ్యంగా మారింది. రోజంతా భక్తుల రాకపోకలతో మేడారం దారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా, ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. జాతర పరిసరాలు, సమీప అటవీ ప్రాంతం భక్తుల గుడారాలతో నిండిపోయింది. శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేస్తూ వాగు ఒడ్డున ఉన్న జంపన్న, నాగులమ్మ గద్దెలకు మొక్కులు చెల్లించి కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించారు. అనంతరం తల్లుల గద్దెలకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి సల్లంగా సూడు తల్లీ అంటూ వేడుకున్నారు.
ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబ సమేతంగా తల్లులను దర్శించుకున్నారు. ఆయనకు పూజారులు, దేవాదాయశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికి తల్లుల గద్దెల వద్దకు తీసుకెళ్లగా ఎత్తు బంగారం సమర్పించుకున్నారు. బంగారాన్ని తలపై మోస్తూ వెళ్లి సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడ్దిరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట ఆత్మ చైర్మన్ రమణయ్య, మండల ఎన్నికల ఇన్చార్జి తాహెర్పాషా, సర్పంచ్ చిడం బాబురావు, తదితరులు పాల్గొన్నారు.