Xi Jinping : చైనా అధ్యక్షుడు జిన్పింగ్ త్వరలో ఇండియా రానున్నారు. వచ్చే సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగి బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే, ఇండియా-చైనాల మధ్య జరిగిన గాల్వాన్ ఘర్షణ తర్వాత జిన్పింగ్ ఇండియాలో పర్యటించనుండటం తొలిసారి అవుతుంది. 2020లో జరిగిన ఈ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పాక్షికంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనుంది. ఈ రెండు రోజులపాటు జిన్పింగ్ ఇండియాలో పర్యటిస్తారు. భారత్-చైనాల మధ్య సంబంధాల బలోపేతానికి జిన్పింగ్ రాక ఎంతగానో ఉపయోగపడుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. జిన్పింగ్ 2013 నుంచి చైనాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ పదమూడేళ్లలో జిన్పింగ్ మూడుసార్లు మాత్రమే ఇండియాలో పర్యటించారు. చివరిసారిగా 2019, అక్టోబర్లో ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత 2020 నుంచి సరిహద్దు (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ)) విషయంలో వివాదం చెలరేగడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. జిన్పింగ్ పర్యటన నేపథ్యంలో చైనా, ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇందుకోసం ముందుగా చైనాతో చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటించే అవకాశం ఉంది. అక్కడి అగ్రనేతలతో అజిత్ దోవల్ ఉన్నతస్థాయి చర్చలు జరుపుతారు. ఈ చర్చలు సానుకూలంగా ఉంటే.. జిన్పింగ్ పర్యటన సందర్భంగా ఢిల్లీలో మోదీతోపాటు భారత అగ్రనాయకులతో కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. బ్రిక్స్ సదస్సుకు పలు దేశాధినేతలు కూడా హాజరవుతారు. మరోవైపు ఇటీవల చైనాపై, ఇండియాపై అమెరికా తీవ్ర ఆంక్షలు, టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు కీలకం కానున్నాయి.