ఏటూరునాగారం, ఫిబ్రవరి 21: జంపన్నవాగులోని స్నానఘట్టాలపై ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నుంచి నీళ్లు రావడం తరుచూ ఆగిపోతుండడంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. భక్తులు బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేస్తూ ఒంటికి సబ్బు రాసుకుని ఉండగా ఒక్కసారిగా నీళ్లు నిలిచి ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు ఎందుకు ఆగిపోయాయో అర్థం కాకపోవడంతో నీళ్లు పోస్తున్న వైపు పరుగులు పెడుతున్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయమో లేక ఇంకేదైనా సమస్యో తెలియడంలేదు. భక్తులు మాత్రం తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాగా, ఊరట్టం పొలిమేరల్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ అలంకారప్రాయంగా మారాయి. పక్కనే తాత్కాలిక మరుగుదొడ్లకు నీటి సరఫరా లేక మల, మూత్ర విసర్జనలకు అవసరమైన నీటిని దూరం వెళ్లి తెచ్చుకుంటున్నారు.