ములుగు: అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర భాగంలో నిలబెట్టిన సీఎం కేసిఆర్.. జిల్లాకొక ప్రధాన పర్యాటక క్షేత్రం అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే పర్యాటక రంగంలో నంబర్ వన్ గా తీర్చిదిద్దే ప్రణాళిక చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
లక్నవరంలో పర్యటించిన మంత్రులు ఈసందర్భంగా.. సస్పెన్షన్ బ్రిడ్జి, 24 కాటేజ్లు, 2 గ్లాస్ కాటేజ్లను ప్రారంభించారు. తెలంగాణలో గట్టమ్మ, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామర్వాయి, మల్లూరు, బొగత జలపాతాలను ట్రైబల్ సర్క్యూట్గా అభివృద్ధి చేసేందుకు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ములుగు ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 79.87 కోట్ల రూపాయలతో చేపట్టామని, ఇందులో భాగంగా లక్నవరంలో 27.65 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూస్తుంటే ఎక్కడున్న వరంగల్ ఎక్కడ పోయింది అనిపిస్తుంది. సీఎం కేసీఆర్ పర్యాటక ప్రేమికులు కావడం వల్ల ఈ ట్రైబల్ సర్క్యూట్ ప్రాంతాలు గొప్ప పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 800 ఏళ్ల క్రితం కట్టిన రామప్పకు ఎంతో కష్టపడి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చారు. ఈ పర్యాటక ప్రాంతాల వల్ల ఈ సర్క్యూట్ బాగా అభివృద్ధిలోకి వస్తుంది.. అని మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి చూస్తే మనం తెలంగాణలో ఉన్నామా? వేరే దేశంలో ఉన్నామా? అన్నట్లు ఉంది. ఇన్ని సంవత్సరాలు వీటిని పట్టించుకోక ప్రాచుర్యంలోకి రాలేదు అన్నది ఇప్పుడు తెలుస్తుంది. తెలంగాణ వచ్చాక ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలుగా వృద్ధిలోకి వస్తున్నాయి. తెలంగాణ వచ్చాక సీఎం కేసిఆర్ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది. పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామంగా గుర్తింపు వచ్చింది. త్వరలోనే లక్నవరంలో అధునాతన పెద్ద బోట్ను అందుబాటులోకి తీసుకొస్తాం.. అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఈ లక్నవరంలో 9 దీవులు ఉన్నాయి. వీటిని కూడా అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాకృతిక పర్యాటక క్షేత్రాన్ని బాగా ప్రచారంలోకి తీసుకు రావడానికి మీడియా సహకరించాలి. సమ్మక్క – సారలమ్మ జాతరలా ప్రపంచ వ్యాప్తంగా ఇంత పెద్ద జాతర ఎక్కడా లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భద్రకాళి ఆలయం, రామప్ప ఆలయాలు గొప్పగా అభివృద్ధి చెందాయి. కొత్త రాష్ట్రం కాబట్టి సీఎం కేసిఆర్ మొదట కరెంట్, వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, పరిశ్రమలపై దృష్టి పెట్టారు. ఇవి పూర్తి అయ్యాక పర్యాటక అభివృద్ధి మీద దృష్టి సారించనున్నారు. దేశం మీద పట్టు ఉన్న నాయకులు సీఎం కేసిఆర్. అందుకే పక్క రాష్ట్రాలు ఇలాంటి నాయకులు మాకు కావాలి అంటున్నారు. అందుకే దేశం మొత్తం ఇలాంటి నాయకులు రావాలి అంటున్నారు. త్వరలోనే బొగత, మల్లూరు జలపాతాలను మరింత అభివృద్ది చేస్తాం. ప్రపంచ హెరిటేజ్లో తెలంగాణను గొప్పగా పెట్టుకుంటున్నాం. జిల్లాకొక పర్యాటక కేంద్రం అభివృద్ధి చేసే ఆలోచన సీఎం కేసిఆర్కు ఉంది. ఈ లక్నవరం గురించి మీడియా గొప్పగా ప్రచారం చేయాలని కోరుతున్నాను. ఇంత ప్రకృతి రమణీయత ఉన్న పర్యాటక క్షేత్రం దేశంలో మరెక్కడా లేదు.. అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
లక్నవరంను ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో అభివృద్ధి చేస్తుంది. సీఎం కేసిఆర్కు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఎనలేని ప్రేమ. సీఎం కేసిఆర్ కృషి వల్ల రామప్పకి యునెస్కో గుర్తింపు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత కాకతీయుల వారసత్వాన్ని కాపాడడంతో పాటు పునః వైభవం తెచ్చారు. ఇప్పుడు చూస్తుంటే ఇది మన ప్రాంతమేనా అన్న ఆశ్చర్యం కలుగుతోంది. అంతగా అభివృద్ధి చెందింది. తెలంగాణ పర్యాటక క్షేత్రాల గురించి దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలి. గోవాను మించిన పర్యాటక క్షేత్రాలు తెలంగాణ సొంతం. ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన నేను, మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్కు చేతులెత్తి ధన్యవాదాలు చెబుతున్నాం.. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు.
అనంతరం మంత్రులు టీజీవో డైరీని ఆవిష్కరించారు. ఈసమావేశంలో ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.