సిద్దిపేట జిల్లా గజ్వేల్ చుట్టూ గ్రామాలను కలుపుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.330కోట్లతో రింగ్రోడ్డు నిర్మాణం చేపట్టారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పనులు ముందుకు సాగినా అప్పట్లో కోర్టు కేసుల కారణంగా పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా అర్ధంతరంగా నిలిచిన అభివృద్ధి పనులపై దృష్టి సారించలేదు. దీంతో సంగాపూర్ మార్గంలో రింగ్రోడ్డు పనులకు మోక్షం లభించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపకపోవడంతో ప్రయాణికులకు రోడ్డు సౌకర్యం అందుబాటులోకి రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 150మీటర్ల రింగ్ రోడ్డు పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
గజ్వేల్, జూలై 27: సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చుట్టూ 23కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా సంగాపూర్ మార్గంలోని సిటిజన్ క్లబ్ వద్ద అసంపూర్తిగా మిగిలిన రింగ్రోడ్డు పనులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం చొరవ చూపక నేటికీ అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. ఇదే మార్గంలో ప్రస్తుతం ఆర్అండ్ఆర్ కాలనీ గ్రామాలు, వర్గల్, చౌదర్పల్లి, మాక్త్త, సింగాయిపల్లి, నెంటూర్, అంబర్పేటతో పాటు ములుగు మండల కేంద్రానికి వెళ్లే ప్రయాణికులు అసంపూర్తిగా ఉన్న రోడ్డుతో తరచూ ఇబ్బందులు పడుతున్నారు.
ఇక్కడ ఒక వరుస రోడ్డు పనులు పూర్తికాగా మరో వరుస మట్టిరోడ్డు కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మట్టి రోడ్డుపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కొందరు వాహనదారులు రాంగ్రూట్లో వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రమాదాలు జరగడంతో ఇద్దరు మృతి చెందగా మరికొంత మందికి గాయాలయ్యాయి. రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్య తీరడంతో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.
గజ్వేల్ రింగ్రోడ్డు అసంపూర్తి పనులను పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా నర్మెట సభలో మెదక్ ఎంపీ రఘునందన్రావు స్వయంగా సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత పెండింగ్లో ఉన్న రింగ్రోడ్డు పనులను ఎంపీ పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అదే సమయంలో బాధిత రైతు రామచంద్రం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి సమస్య విన్నవించారు. ఇదంతా జరిగిన తరుణంలో పనులు పూర్తవుతాయని పట్టణవాసులు భావించారు. మార్చిలో నర్మెట సభలో సీఎం దృష్టికి సమస్యను ఎంపీ తీసుకెళ్లడంతో త్వరలోనే రింగ్ రోడ్డుకు మోక్షం లభిస్తుందని భావించినా ఫలితం మాత్రం నేటికీ కనిపించడం లేదు.
సంగాపూర్ మార్గంలో నిలిచిన రింగ్రోడ్డు పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరనుంది. ప్రస్తుతం చెన్నై, బెంగళూర్, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, చిట్యాల తదితర ప్రాంతాల నుంచి ముంబయి, పుణె, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే కంటైనర్లు, లారీలు శ్రీగిరిపల్లి రింగ్ నుంచి రింగ్ రోడ్డు మీదుగా వెళ్తున్నాయి. అందుకు ప్రభుత్వం వెంటనే గజ్వేల్-సంగాపూర్ మార్గంలో నిలిచిన అసంపూర్తి పనులపై దృష్టి సారించి పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రింగ్రోడ్డు పూర్తయితే పట్టణంలోకి భారీ కంటైనర్లు, లారీలు రాకుండా రింగ్రోడ్డు మార్గంలో వెళ్లే పట్టణ వాసులకు ట్రాఫిక్ సమస్యతో ఉపశమనం లభించనుంది.