ములుగు, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితమని, మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులు సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. ఆదివారం గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి ములుగు జిల్లాలో పర్యటించారు. ముందుగా గట్టమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆనంతరం మేడారం చేరుకొని వనదేవతలను దర్శించుకున్న తర్వాత ఆర్టీసీ బస్టాండ్తో పాటు రెవెన్యూ గెస్ట్హౌస్ను ప్రారంభించారు. అంతకుముందు జాతర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను స్వయంగా పరిశీలించి సిబ్బందికి సూచనలివ్వడంతో పాటు చెత్త బయట వేసిన ఇద్దరు దుకాణాదారులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు వెళ్లి సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకొని భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు.
రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేశాం..
21 శాఖల అధికారుల సమన్వయంతో తల్లుల దీవెనలతో మహాజాతరను సక్సెస్ చేద్దామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం రోజూ 2 నుంచి7లక్షల మంది భక్తులు తల్లుల దర్శనానికి వస్తున్నారని, జాతర ముఖ్యమైన నాలుగు రోజుల్లో కోటి మంది వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. గద్దెల వద్ద ప్రత్యేక అధికారిని నియమించి గంట గంట కూ శుభ్రం చేయించనున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను మళ్లీ జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పారిశుధ్య పనుల నిర్వహణ, శానిటేషన్ కోసం రూ.13 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. షిఫ్ట్ల వారీగా అధికారులను నియమించి భక్తుల సేవలు కొనసాగించాలని చెప్పారు. ఆదివాసీ సంఘాలతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా తల్లులను దర్శించుకోనున్నట్లు తెలిపారు. ఆర్టీసీకి మరింత మంచిపేరు తెచ్చేలా సిబ్బంది పనిచేసి లాభాలు సాధించాలన్నారు. శాశ్వత ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరిన్ని నిధులు కేటాయించడంతో మేడారంలో అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.
సంప్రదాయాలకు భంగం వాటిల్లనివ్వం : మంత్రి సత్యవతి
జాతరలో గిరిజన సంప్రదాయాలకు, ఆచార, వ్యవహారాలకు భంగం వాటిల్లకుండా ప్రతి కార్యక్రమాన్ని వారి సూచనల ప్రకారమే నిర్వహిస్తామని మంత్రి సత్యవతిరాథోడ్ స్పష్టంచేశారు. ఆదివారం మేడారం వచ్చిన మంత్రి.. జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించి సమ్మక్క-సారలమ్మలకు తలనీలాలను సమర్పించారు. ఆ తర్వాత జంపన్నవాగులో, క్యూలైన్లో ఉన్న భక్తుల వద్దకు వెళ్లి సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జాతర కోసం ముందుగా నిధులు విడుదల చేయడంతో గట్టమ్మ వద్ద కోటి రూపాయలతో అభివృద్ధి పనులతో పాటు వివిధ జాతరలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. కార్గో సర్వీసుల ద్వారా వినూత్నంగా మేడారం మొక్కులను చెల్లించే ఏర్పాట్లను చేసి ప్రసాదాలను సైతం అందిస్తున్నట్లు తెలిపారు.