ములుగు, జూన్ 11(నమస్తే తెలంగాణ)/ములుగు రూరల్ : మలిదశ ఉద్యమ ‘కుసుమ’ం నింగికెగసింది. గులాబీ నేత అప్పగించిన బాధ్యతలను, అభివృద్ధి ఫలాలను జిల్లా ప్రజలకు అందించే వారధి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్(47) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు రాగా భార్య రమాదేవి, గన్మెన్లు హుటాహుటిన దవాఖానకు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. జగదీశ్ అకాలం మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రెండు దశాబ్దాలుగా తన వెంట ఉన్న ఉద్యమ కెరటం నేలవాలిందని తెలిసి ఆవేదన చెందారు. బీఆర్ఎస్ పార్టీకి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. జగదీశ్ ఇక లేడని తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కన్నీటిపర్యంతం కాగా ఏజెన్సీ మూగబోయింది. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మల్లంపల్లిలో జగదీశ్ పార్థివదేహానికి నివాళులర్పించారు. సోమవారం ఉదయం స్వగ్రామం మల్లంపల్లిలో అంత్యక్రియలు జరుగనుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. హనుమకొండ స్నేహనగర్లో నివాసం ఉంటున్న జగదీశ్ ఆదివారం ఉదయం 10:30 నిమిషాలకు తన ఇంట్లో స్నానం చేసి బయటకు వస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. భార్య రమాదేవి గమనించి గన్మెన్ల సాయంతో ముందుగా హనుమకొండలోని లైఫ్లైన్ హాస్పిటల్కు తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి కష్టతరంగా ఉందని హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. ఆ తర్వాత హనుమకొండలోనే మరో దవాఖాన అజరకు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆయన కన్నుమూశారు. ములుగు మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వర్ తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ వెంట నడిచి ఉద్యమంలో పాల్గొన్నాడు. 14 ఏండ్ల పాటు హైదరాబాద్లోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉంటూ సీఎం కేసీఆర్తో పాటు పార్టీ నాయకులు సూచించిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేశాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ములుగు నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఎన్నికల తర్వాత ములుగు జిల్లా ఏర్పడిన తర్వాత జగదీశ్ సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ ములుగు జడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది ములుగు జిల్లా తొలి జడ్పీచైర్మన్గా నాలుగున్నర ఏండ్ల పాటు పనిచేశారు. జడ్పీచైర్మన్గా పనిచేస్తున్న జగదీశ్కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జీగా, బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 7న జరిగిన కేటీఆర్ పర్యటనలో సైతం జగదీశ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. గత ఏప్రిల్ 1న జగదీశ్వర్కు తొలిసారి గుండెపోటు రాగా భార్య రమాదేవి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అప్పుడు హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలి కాలం నుంచే ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చివరి సారి ఆయన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న జరిగిన సంక్షేమ సంబురాల్లో పాల్గొన్నారు.
జగదీశ్ రాజకీయ నేపథ్యం
ములుగు మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన కుసుమ సులోచన-ఆదినారాయణ దంపతుల కుమారుడు. 28-08-1976లో జన్మించారు. కుసుమ జగదీశ్ది మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పీజీ వరకు విద్యను అభ్యసించారు. సమైక్యపాలనలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఉద్యమ నేత కేసీఆర్ చేస్తున్న పోరాటాన్ని టీవీల్లో, పేపర్లలో చూసిన జగదీశ్ కేసీఆర్ వెంట నడిచేందుకు పుట్టిన ఊరిని విడిచి వెళ్లి రెండు దశాబ్దాలుగా చురుకైన ఉద్యమకారుడిగా తెలంగాణ వచ్చే వరకు ఎత్తిన జెండా దించకుండా నడిచారు. తెలంగాణ సాధించుకున్న అనంతరం హైదరాబాద్లోనే ఉంటూ సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రజాప్రతినిధులు, నాయకులు అప్పగించిన బాధ్యతలను నిస్వార్థంగా పూర్తి చేస్తూ వచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ములుగుకు చేరుకున్న జగదీశ్ ములుగు జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఏటూరునాగారం జడ్పీటీసీగా పోటీలో నిలిచి అధిక మెజార్టీతో గెలిచి జడ్పీ చైర్మన్గా బాధ్యతలను చేపట్టారు. జగదీశ్ సేవలను గుర్తించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లా ఇన్చార్జి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను అప్పగించారు. నాటి నుంచి నేటివరకు జడ్పీచైర్మన్గా, ఇన్చార్జిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అనునిత్యం ప్రజలు, ప్రజాప్రతినిధుల మధ్య ఉంటూ ములుగు జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఈ నెల 7న జరిగిన మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంలోనూ చురుకైన పాత్ర పోషించి తన మార్క్ను చాటుకున్నారు.
కన్నీటిపర్యంతమైన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి
జగదీశ్ మృతి విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, తాత మధు, రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్, మానుకోట ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎంపీ సీతారాంనాయక్, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణఆదిత్య, ఎస్పీ గౌస్ ఆలం మల్లంపల్లికి చేరుకొని జగదీశ్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంత్రి సత్యవతిరాథోడ్ జగదీశ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు.. జగదీశ్వర్ మృతి పట్ల సంతాపం వెలిబుచ్చుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..
జగదీశ్ అకాల మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల ఆవేదన చెందిన కేసీఆర్ శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు ఆత్మైస్థెర్యాన్ని కల్పించాలని భగవంతుడిని ప్రార్థించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీశ్ పోషించిన చురుకైన పాత్రను ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జడ్పీచైర్మన్గా జగదీశ్ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొనడంతో పాటు సీఎం కేసీఆర్.. జగదీశ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నేడు మల్లంపల్లిలో నిర్వహించే అంత్యక్రియలను దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా చెప్పారు.
బీఆర్ఎస్కు, ములుగుకు తీరని లోటు : మంత్రులు కేటీఆర్, హరీశ్రావు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ తీవ్ర ఆవేదన చెందారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జగదీశ్ కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలియజేస్తూ ఉద్యమకాలం నుంచి రెండు దశాబ్దాలకు పైగా సీఎం కేసీఆర్తో పాటు పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడిగా సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. ఈ మధ్యనే తాను ములుగు జిల్లాలో పర్యటించినప్పుడు అత్యంత చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న జగదీశ్ అకాల మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి, ములుగు జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జగదీశ్ అకాల మరణం బాధాకరమని పేర్కొంటూ, అత్యంత సన్నిహితుడైన జగదీశ్ సుదీర్ఘకాలం పాటు పార్టీకి సేవలు అందించి ఆయనను కోల్పోవడం తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ములుగు జిల్లాలో పర్యటించినప్పుడు ప్రభుత్వ దవాఖానను జగదీశ్తో ప్రారంభించిన ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం ట్విట్టర్ వేదికగా జగదీశ్వర్ మృతి పట్ల సానుభూతిని వ్యక్తం చేశారు.
మిన్నంటిన రోదనలు
గుండెపోటుతో హనుమకొండలోని అజార దవాఖానలో మృతి చెందిన జడ్పీచైర్మన్ జగదీశ్ విగతజీవిలా పడి ఉండడంతో అతడి భార్య రమాదేవి, కుమారుడు వెంకట సత్యదేవ్, కుమార్తె హరిచందన, ఆయన తల్లిదండ్రులు ఆదినారాయణ-సులోచనలు చేసిన రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు కన్నీటి పర్యంతమయ్యాయి. ఉద్యమ నాయకుడికి నేడు కడసారి వీడ్కోలు పలికేందుకు మల్లంపల్లిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లను గ్రామంలో వైకుంఠధామంలో నిర్వహించనున్నారు.
నేడు మల్లంపల్లికి మంత్రి కేటీఆర్
సోమవారం జరిగే జగదీశ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ములుగు జిల్లాకు రానున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి 9గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న హెలిప్యాడ్కు 9:30కు చేరుకోనున్నారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో మల్లంపల్లి చేరుకొని జగదీశ్ పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. అనంతరం జరిగే అంతిమయాత్ర, దహన సంస్కారాల కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. కార్యక్రమం ముగిన తర్వాత 10:30గంటలకు హెలిక్యాప్టర్లో హైదరాబాద్కు తిరిగి వెళ్తారు.