ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా సాగాయి. ఈ రోజు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. దీంతో ఉదయం నుంచే వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వరంగల్లోని గిర్మాజీపేట గోవిందరాజుల ఆలయం, బట్టలబజార్లోని శ్రీబాలానగర్ వేంకటేశ్వరాలయం, హనుమకొండ జిల్లాలోని వైష్ణవ ఆలయాలు, జనగామ జిల్లాలోని వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయం, చిల్పూరులోని బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయం, భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం కాళేశ్వరం, ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులోని హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాయి. నారాయణుడి నామస్మరణతో మార్మోగాయి.