ముంబై: నెలసరి సమస్యలకు చికిత్స కోసం అడ్మిట్ అయిన బాలిక గర్భవతి అని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారించారు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆ బాలిక గర్భం దాల్చలేదని తేలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. (Girl Declared Pregnant) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల బాలిక నెలసరి సమస్యలతో బాధపడుతున్నది. చికిత్స కోసం కళ్యాణ్-డోంబివ్లి ప్రాంతంలోని శాస్త్రి నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె అడ్మిట్ అయ్యింది. అయితే బాలిక కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే ఆమెకు మూడుసార్లు గర్భధారణ పరీక్షలు చేశారు. ఆ బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
కాగా, ఇది తెలుసుకుని బాలిక కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. నిర్ధారణ కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆ బాలిక గర్భం దాల్చలేదని తేలింది. అనంతరం పిరియడ్స్ సమస్యకు సంబంధించిన చికిత్సను అక్కడ అందించారు. దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యుల ఆందోళన తొలగిపోయింది.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అనుసరించిన పరీక్షా విధానాలు, వైద్య ప్రక్రియలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు రావడంతో మున్సిపల్ కమిషనర్ విచారణకు ఆదేశించారు.