Sunke Ravishankar | గంగాధర: ఎల్లంపల్లి ప్రాజెక్టు, నారాయణపూర్ (Narayanapur) రిజర్వాయర్పై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసత్యాలు మాట్లాడుతున్నారు. ఆయన ఈ మాటలు మానుకొని నిజాలు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. గంగాధర మండలం మధురానగర్ వద్ద అసంపూర్తిగా ఉన్న నారాయణపూర్ కుడి కాలువను బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చొప్పదండి నియోజకవర్గంలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కనీస అవగాహన లేదని దుయ్యబట్టారు.
2004 లో నారాయణపూర్ రిజర్వాయర్ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించినా, తట్టెడు మట్టి కూడా తియ్యలేదని అన్నారు. 2014 లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాతే 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మధురానగర్ వద్ద బ్రిడ్జి నిర్మాణం తో పాటు, రైల్వే లైన్ కింద బ్రిడ్జి నిర్మాణం తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలోనే పూర్తి చేశానని గుర్తు చేశారు. మంగపేట (Mangapeta) నిర్వాసితులకు రూ. 14 కోట్ల పరిహారం అందించామని తెలిపారు. నారాయణపూర్ నిర్వాసితులకు పరిహారం ఎన్నికలు రావడంతో నిలిచిపోయిందని పేర్కొన్నారు.
పరిహారంపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ గుండాలతో గ్రామస్తులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయంలో జరిగిన అభివృద్ధిపై మధురానగర్ చౌరస్తాలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంలో ప్రకటించి పరిహారం అందించాలని లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా(Resign) చేయాలని డిమాండ్ చేశారు.
ఆయనతో గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలా గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, నాయకులు వేముల దామోదర్, రామిడి సురేందర్, ముక్కెర మల్లేశం, బొల్లాడి శ్రీనివాస్ రెడ్డి, పడ్లూరి ఆదిమల్లు, గడ్డం స్వామి, దోమకొండ మల్లయ్య, లింగాల దుర్గయ్య, ఆకుల మధుసూదన్, తూము మల్లారెడ్డి, సముద్రాల అజయ్ ఉన్నారు.