మహబూబాబాద్, జనవరి 11 : ‘కేంద్రమంత్రి కిషన్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి రాష్ట్రం అభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. ఎనిమిదేళ్ల కిందటి తెలంగాణకు నేటి తెలంగాణ రాష్ట్రానికి తేడా కనించడం లేదా..?, కళ్లుండీ చూ డలేని మూర్ఖులు మీరు’ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. పేదల ప్రజల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా అమలు చేస్తున్నారని అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంత్రి సత్యవతి నివాసంలో ఆమె తో కలిసి నిర్వహించిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. మహబూబాబాద్ను జిల్లా చేస్తామని, మెడికల్, నర్సింగ్ కాలేజీ, కలెక్టర్ కార్యాలయాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, బీమా తదితర పథకాలను మేనిఫెస్టోలో పెట్టకుండానే పేదల కోసం చేస్తున్నామని, ఇవన్నీ దేశంలోనే ఆదర్శంగా నిలిచే పథకాలని అన్నారు. ప్రజలకు ఏది అవసరమో సీఎం కేసీఆర్కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని స్పష్టం చేశారు.
ఇవన్నీ చూస్తూనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సోయి లేక మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మీరు పాలిస్తున్న కర్ణాటక, ఛత్తీస్గఢ్, గుజరాత్ వంటి రాష్ర్టాల్లో ఇక్కడి కంటే ఎక్కువ అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి ఎర్రబెల్లి రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మోటర్లు మీటర్లు నిత్యం కాలిపోయేవన్నా రు. నాడు ఎండాకాలం వచ్చిందంటే తాగునీటి కోసం ప్రజలు బిందెలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి గొడవలు పెట్టుకునే వారని ధ్వజమెత్తారు. నేడు రాష్ట్రంలో మిషన్భగీరథ పథకం ద్వారా రూ.40వేల కోట్లు ఖర్చు చేసి ఇంటింటికీ శుద్ధి చేసిన జలాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. గ్రామా ల్లో చెత్త తీసేందుకు అప్పట్లో 800 ట్రాక్టర్లు మాత్రమే ఉంటే నేడు తెలంగాణలో చెత్త తీయడానికి 12వేల ట్రాక్టర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. స్వచ్ఛభారత్ లో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణకే ఎక్కువ అవార్డులు వచ్చింది మీకు గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. కేంద్రం రాష్ర్టానికి రావాల్సిన రూ. 11వేల కోట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నదని, ఆ పార్టీ నాయకులకు సిగ్గుంటే ఈ విషయంపై కేంద్రం పెద్దలను నిలదీయాలన్నారు. 8 నెలలుగా నిధులు పెండింగ్లో ఉండడం తో సర్పంచ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నా రు. ఈ డబ్బులు మీరు ఇచ్చే భిక్ష కాదు.. అది మాకు రావాల్సిన రొక్కమని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ మానుకోటలో ప్రారంభోత్సవాల అనంతరం 10వేల మందితో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
అంతకుముందు మంత్రి సత్యవతి సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు వెల్లడించారు. ఉదయం 9.45 గంటలకు తాళ్లపూసపల్లి రోడ్డులోని హెలిప్యాడ్ వద్ద దిగి 10 గంటలకు టీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకొని ప్రారంభిస్తారు. 11 గంటలకు కొత్త కలెక్టరేట్కు చేరుకుని ప్రా రంభిస్తారు. 11.30 గంటలకు ఇల్లందు రోడ్డులో నిర్వహించే ఓపెన్ మీటింగ్లో మాట్లాడుతారని మంత్రి తెలిపారు. మధ్యాహ్నం 1.30కు లంచ్, అనంతరం హెలిక్యాప్టర్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం చేరుకుని కలెక్టర్ కార్యాలయం ప్రారంభిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, నాయకులు పాల్గొన్నారు.