డోర్నకల్, ఏప్రిల్ 5 : కేసీఆర్తోనే రైతులకు స్వర్ణయుగమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గడిచిన పదేళ్లలో కేసీఆర్ రైతును రాజు చేశారని, వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు రైతుబంధు, సమయానికి విత్తనాలు, ఎరువులు అందించారని అన్నారు. మే, జూన్ నెలల్లో 45, 50 అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా ప్రజలెవరూ నీళ్ల కోసం బిందెలు పట్టుకుని బయటికి రాలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతులకు కరువు తెచ్చిందన్నారు.
రైతుల పంట పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని అన్నారు. రాజకీయాలు ఎన్నికలప్పుడే చేయాలని, రైతుల జీవితాలతో ఆడుకోవద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రెండు వేల మంది రైతులతో డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో ఒక్క రోజు దీక్ష చేయనున్నట్లు తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గాలికి వదిలి, ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
రేవంత్రెడ్డిని అనవసరంగా గెలిపించామని ప్రజలు, రైతులు బాధపడుతున్నట్లు తెలిపారు. మూడెకరాల వరకు కూడా రైతుబంధు పడలేదని, రైతులకు రూ. 2లక్షలు రుణమాఫీ చేయలేదన్నారు. రైతులకు ఎకరానికి రూ.500 బోనస్ ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. రైతులకు బోనస్ ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం అందజేశామన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. చాలామంది సొంత రాజకీయాలు, స్వ ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నట్లు తెలిపారు. పార్టీలు మారే వారికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
పార్టీలు మారిన నాయకులతో బీఆర్ఎస్ పార్టీకి నష్టమేమీ లేదన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మహబూ బాబాద్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని, అండగా ఉండి కాపాడుకుంటామన్నారు. కేసీఆర్ బిడ్డగా ఆదరించి తనకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి కట్టబెట్టినట్లు తెలిపారు. జీవితాంతం బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కత్తెరశాల విద్యాసాగర్, కౌన్సిలర్లు తేజావత్ సంధ్యారాణి, పోటు జనార్దన్, బోరగళ్ల శరత్బాబు, నాయకులు మాన్యుపాట్ని, తేజావత్ రమేశ్, కాలా యశోధర్జైన్, కొత్త వీరన్న, కొత్త రాంబాబు పాల్గొన్నారు.