స్టేషన్ ఘన్పూర్, ఫిబ్రవరి 7 : మోదీ ప్రధాని అయ్యాక దేశాభివృద్ధి శూన్యమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్రెడ్డి నివాసంలో పార్టీ జిల్లా నాయకుడు బలిదె వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడారు. సంక్షేమ పథకాలు ఎత్తివేయాలన్న ప్రధాని మోదీ పేద వర్గాలు ఎలా బతకాలో ఆలోచించలేదన్నారు. బడా వ్యాపారులు, బడా సంస్థలకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. వివిధ బ్యాంకుల్లో 22 మంది రుణాలు తీసుకొని చెల్లించకపోవడంతో ఎన్పీఏ కింద మాఫీ చేస్తున్నారన్నారు. ఇందులో గుజరాత్కు చెందిన 21 మంది వ్యాపారులు రుణాలు ఎగవేసి విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని చెప్పారు. వారి రుణాలు మాఫీ చేయడం తెలిసిన మోదీకి పేదలు గుర్తుకు రావడంలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ అంటే పడని బీజేపీ ఇక్కడ అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలని కడియం కోరారు.
కుల మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గుడుపుకుంటున్న ఆ పార్టీకి తగిన బుద్ది చెప్పాలన్నారు. పేదలు, రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలని రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టి 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు పంట పెట్టుబడి సాయం అందించారన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, కంటి వెలుగు వంటి పథకాలతో పేదలను ఆదుకుంటున్నారన్నారు. ఇక్కడి పథకాలను పంజాబ్, ఢిల్లీ సీఎంలు ప్రశంసించారని, ఆయా రాష్ర్టాల్లో అమలు చేస్తామని వారు చెప్పారన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను అనుకరిస్తున్నాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ కంటే మించి ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ? వారి తలసరి ఆదాయం ఎందుకు పెరుగడంలేదన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒరిగిందేమీలేదన్నారు. విభజన హామీలను నెరవేర్చేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం ప్రతిపాదనలు పంపి ప్రధానికి వివరిస్తే అధికారులు జాకారం వద్ద పరిశీలించి తాత్కాలికంగా అనుమతులు ఇచ్చారని, కానీ, ఒక మంత్రి గిరిజన యూనివర్సిటీకి ప్రతిపాదనలు పంపలేదనడం సిగ్గుచేటని కడియం అన్నారు.
రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి రూ.లక్ష కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం 2023 – 2024 బడ్జెట్లో 2,96,396 కోట్లు కేటాయించిందని, ఇందులో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, పేదల సంక్షేమానికి రూ.లక్ష కోట్లు కేటాయించిందని కడియం అన్నారు. ప్రతి పక్షాలు రాజకీయ విమర్శలు చేసినా తెలంగాణలో పోటీ పడే సత్తా లేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్ అని, తలసరి ఆదాయం ఇతర రాష్ర్టాలకంటే అధికంగా ఉందన్నారు.
షర్మిలను చూస్తే జాలేస్తోంది..
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను చూస్తే జాలేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. అనవసరంగా పాదయాత్రలతో సమయం, శక్తి, వనరులను వృథా చేసుకుంటుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో సమైక్యవాదంతో తిరిగిన షర్మిల తెలంగాణలో రాజకీయం చేస్తానంటే ప్రజలు అంగీకరించరన్నారు. జగన్ వల్ల అన్యాయం జరిగితే ఆ ప్రాంతంలో పాదయాత్రలు చేయాలి కానీ, ఇక్కడ పాదయాత్రలు చేస్తే ఏం వస్తుందన్నారు. వైస్ జగన్ గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోతుందని, రేపో మాపో జైలుకు పోతే అక్కడ నీకు కలిసి వస్తుందని షర్మిలకు కడియం హితవుపలికారు. వైఎస్సార్ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకమని, తెలంగాణపై ఆ కుటుంబానికి మాట్లాడే అర్హత లేదన్నారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల కరుణాకర్రావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రాంబాబు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అన్నెపు అశోక్, సర్పంచుల ఫోరం స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల అధ్యక్షులు పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, ఎంపీటీసీలు బూర్ల లతా శంకర్, సర్పంచులు కోతి రేణుకా రాములు, అనితా సుధాకర్బాబు, అనుమాల, అయోధ్య, మల్లేషం, మాజి జడ్పీటీసీ స్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.