న్యూఢిల్లీ, ఆగస్టు 18: బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రిటైలర్లు, స్టాకిస్టులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో వరుసగా రెండోరోజూ బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2 వేలు ఎగబాకి రూ.1,58,800కి చేరుకున్నది.
అంతకుముందు రోజు ఈ ధర రూ.1,56, 800గా ఉన్నది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా అధికమయ్యాయి. కిలో వెండి రూ.730 పెరిగి రూ.2,40,730 పలికింది. గత రెండు రోజులుగా ఫ్లాట్గా ఉన్న వెండి ధరలు అధికమయ్యాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,394.57 డాలర్లు పలుకగా, వెండి 65.08 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం వల్లనే గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,392 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నదని మిరాయి అసెట్ షేర్ఖాన్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు.