ఎల్కతుర్తి, జూలై 20 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గతంలో టీడీపీలో పనిచేసిండు కాబట్టి ఇంకా అతని మనసంతా ఆంధ్రాలోనే ఉందని, ఒక మనిషి మాత్రమే తెలంగాణలో ఉన్నాడని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. రేవంత్రెడ్డి రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని చెప్పడాన్ని నిరసిస్తూ గురువారం కోతులనడుమ రైతువేదికలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. దీనికి జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్తో కలిసి ఎమ్మెల్యే సతీశ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీశ్కుమార్ మాట్లాడుతూ రేవంత్రెడ్డి పార్టీ మారి రంగు మార్చిండే తప్ప, ఇంకా మనిషి మారలేదన్నారు. ఆంధ్రా, తెలంగాణ పరిస్థితులు వేరని, ఆంధ్రాలో కాల్వకు కాలు అడ్డం పెడితే పొలం పారుతుందని, కానీ, తెలంగాణలో విద్యుత్పైనే ఆధారపడి పంటలు పండుతాయన్నారు.
అక్కడ వ్యవసాయం చూసిన రేవంత్రెడ్డికి, ఇక్కడ కూడా అలాగే పండుతాయని భ్రమపడి 3 గంటల విద్యుత్ సరిపోతుందని మాట్లాడి ఉంటాడని చురకలంటించారు. వ్యవసాయం గురించి తెలియని ఆ వ్యక్తి కరెంటు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 24 గంటల కరంటు, రైతుబంధు, రైతు బీమా, రూ.2వేల ఆసరా ఫించన్, దివ్యాంగులకు రూ. 4వేల ఫించన్ ఇస్తున్నారో రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రైతుబంధును కాపీ కొట్టి రూ. 2వేలు ఇస్తుందని, అది కూడా అందరికీ అందడం లేదని విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి అంతా కాంగ్రెస్ హయాంలోనే చేశామని, ఇప్పుడు ఏం చేయలేదని, రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాడన్నారు. ఒకసారి అప్పుడు, ఇప్పుడు జరిగిన అభివృద్ధిని గమనించాలని హితవు పలికారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతానికి లక్షా 6వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని, ఏ ఊరికి వెళ్లినా అభివృద్ధి కండ్లకు కొట్టొచ్చినట్లు కనపడుతుందన్నారు. కాకుండా సింగరాయ, శనిగరం ప్రాజెక్టులు పూర్తి చేసి, ఈ ప్రాంతాన్ని సాగునీటితో సస్యశ్యామలం చేశామని వివరించారు. 2018 వరకు రైతులకు లక్ష వరకు రుణమాఫీ చేశామని, ఇప్పుడు సీఎం కేసీఆర్ రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే ఆ హామీని కూడా నెరవేర్చుతామన్నారు. ముల్కనూర్ సహకార సంఘంలో అధ్యక్షుడిగా ప్రవీణ్రెడ్డి రైతులకు ఇచ్చే రుణాలపై వడ్డీని తగ్గించవచ్చు కదా అని ప్రశ్నించారు. 2004, 2014 కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారో, ఎన్ని చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ ప్రజలు చైతన్యవంతులని, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
కాంగ్రెస్, బీజేపీ వస్తే అంధకారమే
ఒకప్పుడు తెలంగాణను చీకటిలోకి నెట్టిన కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కరెంటు పోయి రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్ అన్నారు. రేవంత్రెడ్డి 3గంటల కరంటు ఇదే భావనను కలిగిస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో గట్టి వానలు పడితే చెరువులు, కుంటలు తెగిపోయేవని, అందుకే మిషన్ కాకతీయతో చెరువులను లోతు చేసుకొని భూగర్భ జలాలను పెంచుకున్నామన్నారు. టీడీపీ, కాంగ్రెస్, మోదీ కరెంటు ఎలా ఉంటదో చూశామని, వారి హయాంలో కోతలతో ప్రజలంతా పనుల్లేక వలస వెళ్లారన్నారు. అనంతరం 3 గంటల కరెంటుకు వ్యతిరేకంగా రైతులతో తీర్మానాలను చేయించారు. అలాగే, మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన రూ. 3,40,500 విలువైన 11 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సతీశ్కుమార్, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్గౌడ్, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, రైల్వే బోర్డు మెంబర్ ఎల్తూరి స్వామి, సొసైటీ వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు, సర్పంచ్ బోయినపల్లి రజిత, ఎంపీటీసీ చెవుల కొమురయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్, నాయకులు మాసిపెద్ది భాస్కర్రావు, సామల సురేశ్రెడ్డి, దేవేందర్రావు, దుగ్యాని సమ్మయ్య, వెంకటేశ్యాదవ్, మేకల కోమల, వేముల శ్రీనివాస్, గొడిశాల వినయ్, చిట్టిగౌడ్, కడారి నవీన్, కొంగ ప్రవీణ్ పాల్గొన్నారు.