ఎల్కతుర్తి/భీమదేవరపల్లి, జూన్ 8 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునర్నిర్మించడంతో చెరువులన్నీ వేసవి కాలంలో సైతం జలకళను సంతరించుకున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం దామెర గ్రామంలో నిర్వహించిన చెరువుల పండుగలో ఎమ్మెల్యే సతీశ్కుమార్తోపాటు కలెక్టర్ సిక్తా పట్నాయక్, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్లు మహిళలతో కలిసి కాసేపు బతుకమ్మ ఆడారు. అనంతరం దామెర చెరువును చూసిన తర్వాత అక్కడ భోజనాలను పరిశీలించారు. చెరువుల పండుగ జరుగుతున్న తీరు గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
మండలేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే సతీశ్కుమార్ పూజలు చేశారు. అనంతరం చింతలపల్లి, ఎల్కతుర్తి, గోపాల్పూర్ గ్రామాలతో పాటు భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే సతీశ్కుమార్, జడ్పీ చైర్మన్ సుధీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీశ్కుమార్ మాట్లాడుతూ గతంలో వేసవి వచ్చిందంటే చెరువులన్నీ ఎండిపోయేవని, సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడిక తీయడంతో నేడు ఎక్కడా చూసిన నీళ్లకు కొదువ లేదన్నారు. చెరువుల్లో నీళ్లుండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రెండు పంటలను రైతులు పండించుకుంటున్నారన్నారు. రైతులే కాకుండా మత్స్యకారులకు సైతం ఉపాధి దొరుకుతోందన్నారు. ప్రభుత్వమే సబ్సిడీ చేప పిల్లలను చెరువుల్లో పోయడం ద్వారా వారు లబ్ధి పొందుతున్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని తెలిపారు. సంక్షేమ పథకం పొందని ఒక్క ఇల్లు కూడా నేడు తెలంగాణలో లేదంటే అతిశయోక్తి కాదన్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఎంతో గణనీయమైన పురోగతిని సాధించామన్నారు. అందుకే నేడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మేకల స్వప్న, తహసీల్దార్ గుజ్జుల రవీందర్రెడ్డి, ఎంపీడీవో తూర్పాటి సునీత, పీఆర్ ఏఈ ప్రణవ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు, సర్పంచ్లు చల్లా రవీందర్రెడ్డి, కొమ్మిడి నిరంజన్రెడ్డి, మాసిపెద్ది భాస్కర్రావు, కుడుతాడి అనిత, ఎంపీటీసీలు గొర్రె ఆదాం, వేముల రజిని, బోయినపల్లి యశోద, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్, నాయకులు పాల్గొన్నారు. కాగా, అన్ని గ్రామాల్లోని చెరువుల వద్ద చెరువుల పండగను ఘనంగా నిర్వహించారు. చెరువుల వద్దకు మహిళలు బతుకమ్మలు, కోలాటాలతో తరలివచ్చి ఆడిపాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని పలువురు ఈ సందర్భంగా వివరించారు. చెరువుల వద్దే గ్రామస్తులకు భోజనాలను ఏర్పాటు చేశారు.