మహబూబాబాద్/మహబూబాబాద్ రూరల్, జూలై 29 : పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతామనిఎమ్మెల్యే శంకర్ నాయక్ స్పష్టం చేశారు. హాస్టల్ను శుక్రవారం ఆయన సందర్శించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మెరుగైన వసతులతో విద్యనందిస్తుంటే కొందరు అధికారుల నిర్లక్ష్యం మూలంగా విద్యార్థులకు నష్టం జరుగుతోందన్నారు. వసతి గృహంలో వసతులను, వంట గదిని పరిశీలించి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ శశాంకతో ఫోన్లో మాట్లాడారు. హాస్టల్ మెనూపై చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యను అందించాలని, బాధ్యులపై శాఖా పరమైన చర్యలు వెంటనే తీసుకోవాలన్నారు. విషయం తెలిసి మంత్రి సత్యవతి వెంటనే కలెక్టర్ శశాంక, జిల్లా గిరిజన అధికారులతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థులకు మంచి వైద్యం అందించాలని, హాస్టల్ను వెంటనే శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఘటనపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎర్రయ్యను వివరణ కోరగా స్థానిక తహసీల్దార్తో కలిసి పూర్తి విచారణ చేయిస్తున్నామని, అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్పారు. అదరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని వారు తెలిపారు.
9 మందికి మెరుగైన వైద్యం
ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారిని వెంటనే హాస్టల్ వార్డెన్, అధికారులు దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. హాస్టల్ వార్డెన్ బియ్యాన్ని, వంటకు వాడే వాటిని శుభ్రం చేయకుండానే వర్కర్లతో వడ్డించడం వల్లే అస్వస్థల కలిగిదని విద్యార్థులు, తల్లిదండ్రులు వివరించారు. గురువా రం అర్ధరాత్రి ఇబ్బందులు ఎదురుకాగా వర్కర్లు వార్డెన్ కు సమాచారం అందిస్తే విద్యార్థులను హాస్పిటల్కు తరలించారని తెలిపారు. గతంలోనూ నాలుగు సార్లు భోజ నం బాగాలేకనే అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ డేవిడ్ సైతం గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎర్రయ్య, తహసీల్దార్ నాగభవానితో కలిసి వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో వివరాలు తెలుకున్నారు. బాధ్యులైన హాస్టల్ వార్డెన్ రోజాలీనా, ఏటీడీవో సత్యవతిపై చర్యలు తీసుకుంటామన్నారు.