నర్సంపేట, నవంబర్ 28 : నర్సంపేటలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని, 51వేల మెజార్టీ సాధిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అయిదేళ్ల కాలంలో తాను చేసిన అభివృద్ధిని చూసిన ప్రజల ఆదరణ బాగుందన్నారు. బోనాలు, బతుకమ్మలతో గ్రామాలు, తండాల్లో పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం పలికారన్నారు. 2018లో 16,700 మెజార్టీతో గెలిచానని, ఇప్పుడు అంతకంటే రెట్టింపు స్థాయి మెజార్టీ వస్తుందని నమ్మకం ఉందన్నారు. నర్సంపేట ఎమ్మెల్యేగా తక్కువ కాలంలో ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేశానని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డితో పాటు మరొకరు హత్యలు చేసి జైలు పాలైన విషయం మరిచారా? అని ప్రశ్నించారు. తనపై ఒకసారి మాట్లాడితే వీరిపై వందసార్లు మాట్లాడాల్సి వస్తుందని అన్నారు.
నర్సంపేటలో రౌడీయిజం, గూండాయిజం లాంటి పనులు చేస్తామంటే కుదరదని చెప్పారు. ప్రజలు ప్రతిపక్ష నాయకుల తీరుతో విసిగిపోయారన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండేందుకు కోరుకుంటున్నారని, అలాంటి వారే తనలాంటి వారికి అవకాశం ఇచ్చారని తెలిపారు. నిధులు తెస్తే కాంగ్రెస్ నాయకులు కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకు వస్తున్నారని, పనులకు అడ్డుపడుతున్నారని చెప్పారు. తాను పంట నష్టపరిహారం తెస్తే దిష్టిబొమ్మలను దహనం చేయించారని, ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు నర్సంపేటను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా రెండో సారి గెలిస్తే రింగురోడ్డు నిర్మిస్తానని తెలిపారు. పాకాల లైనింగ్ కాల్వల నిర్మాణం కూడా చేపడుతానన్నారు.అభివృద్ధి పనులు కొనసాగాలంటే తాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. ఎన్నికల్లో తప్పకుండా తన కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.