Leopard : మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. గ్రామ శివార్లలోని ఓ గ్రానైట్ క్వారీ వైపు ఉన్న తన వ్యవసాయ భూమి వద్ద చిరుతపులి కనిపించిందని గండికోట కుమార్ అనే రైతు గ్రామస్తులకు తెలిపాడు. సోమవారం సాయంత్రం తన పొలం దగ్గర దూరంగా చిరుతపులి కనిపించిందని కుమార్ చెప్పాడు. ఆ పులిని చూసి తీవ్ర భయాందోళనకు గురైన తాను పెంపుడు కుక్కతో సహా సమీపంలోని ఒక బావిగుంతలో దాక్కున్నానని వెల్లడించాడు.
అంతకుముందు పులి వెళ్లిపోయిన తర్వాత తన పొలంలోని పాదముద్రలను ఫోన్లో ఫోటో తీసి గ్రామంలోని వాట్సాప్ గ్రూపులో పెట్టాడు. దాంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కాగా పులి తనకు గత రెండు రోజులుగా కనిపిస్తున్నట్లు కుమార్ చెప్పాడు. ఇదిలాఉండగా మూడు రోజుల క్రితం గూడూరు మండలం బొల్లెపల్లి ప్రాంతంలోనూ చిరుత కనిపించిందని అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. అయితే అటవీశాఖ అధికారులు వెతికినప్పటికీ పులిజాడ కనిపించలేదని తెలిసింది.
ఈ విషయంపై అటవీశాఖ సిబ్బంది మాట్లాడుతూ.. అర్పనపల్లిలో పులి పాదముద్రలు లభించినట్లు గ్రామస్తులు సమాచారం అందించారని, ఇది అడవిపిల్లి పాదముద్రలు కూడా అయి ఉండవచ్చునని అన్నారు. కాగా ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపుతామని చెప్పారు.