నెక్కొండ, జూలై 2 : ప్రభుత్వం వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్ ఆధ్వర్యంలో యాదవసంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా యాదవుల కోసం మేకలు, గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా యాదవసంఘం ప్రతినిధులు ముందుకుసాగాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా యాదవ సంఘం ప్రతినిధులు తమ సమస్యలను వివరించడంతో పాటు రెండో దశ గొర్రెల పంపిణీపై తమ సూచనలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చలువతోనే గొర్రెల పంపిణీ పథకం అమలు చేస్తోందని, సీఎం కేసీఆర్కు యాదవులందరూ అండగా నిలువాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నెక్కొండ ఉప సర్పంచ్ డీ వీరభద్రయ్య, బండారు కొమురయ్య, ఐలయ్య ఉన్నారు.