దుబ్బాక, ఆగస్టు 14: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అరాచక పాలన కొనసాగిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియాతో ఆయన మాట్లాడారు. మొన్నటి వరకు హైడ్రా పేరిటి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు 22ఏ చట్టం తెచ్చి లక్షలాది ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల ఉసురు తీసుకుంటున్నదని విమర్శించారు. 22ఏ పేరిట అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, ప్రజల నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు.
అనేక మంది రైతులు, ప్రజలు తమ భూములు విక్రయించుకోలేక, కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మూడేండ్ల కాం గ్రెస్ పాలనలో ప్రజలు భద్రతా భావనతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాగ్రహానికి గురై కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడుతున్నారని, దుబ్బాకలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇంతవరకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. మండలాల్లో ప్రజావాణి పేరిట ప్రభుత్వం ఆర్భాటం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కలెక్టరేట్ల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కరించారానికి నోచుకోవడం లేదన్నారు.
గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ఎంపీడీవోల వద్ద నిధులు లేవన్నారు. దుబ్బా క చేనేత కార్మికులకు ఆసరా పింఛన్ మం జూరు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. దుబ్బాక సొ సైటీలో 1500 మంది చేనేతలుంటే, వారికి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటేనే పింఛన్ మంజూరు చేస్తామని అధికారులు చెప్పడం సరికాదన్నారు. యూరియా కోసం యాప్ల పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగదని విమర్శించారు. కలెక్టర్, అధికారులు దుబ్బా క నియోజకవర్గంపై చిన్నచూపు చూడడం సరికాదన్నారు. ఏ ఒక్క ఆర్డీవో దుబ్బాకకు రావడం లేదన్నారు.