మర్పల్లి, ఆగస్టు 14 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఎత్తేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని పంచలింగాల్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. సర్పంచ్ మహేందర్, శంకర్రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ కంటెస్టెంట్ దేవాదానం, ఇండిపెండెంట్ వార్డు సభ్యుడు విజయ్తోపాటు పలు పార్టీల నుంచి 80 మంది నాయకులు మెతుకు ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా, డీఏపీల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బం ట్వారం మండలంలోని రొంపల్లిలో నకిలీ ఎరువు దొరికిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన రూ.లక్షతోపాటు తులం బంగారాన్ని నిలిపేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తున్నదని దుయ్యబట్టారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో బాల్య వివాహాలు చాలావరకు తగ్గాయని ఆయన గుర్తు చేశారు. రానున్న రోజుల్లో రైతుబీమాతోపాటు, రైతుబంధు కూడా నిలిపివేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రానున్నది మన ప్రభుత్వమేనని నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, రావులపల్లి సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, మాజీ జడ్పీటీసీ మధుకర్, మాజీ వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, మండల నాయకులు మధుకర్, నాయబ్గౌడ్, రమేశ్, అశోక్, పీఏసీఎస్ డైరెక్టర్ యాదయ్య, షఫీ, సుభాష్ యాదవ్, దాసుగౌడ్, ప్రవీణ్ యాదవ్, నర్సింహులు, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.