నర్సంపేట, ఫిబ్రవరి 2 : సీఎం కేసీఆర్ను పాదయాత్ర చేయాలని, బూట్లు సిద్ధంగా ఉన్నాయని వైఎస్ షర్మిల చూపించడం తగదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైస్ షర్మిల పాదయాత్ర ప్రారంభానికి ముందు హైదరాబాద్ ప్రెస్మీట్ పెట్టి సీఎం కేసీఆర్ గురించి మాట్లాడడం సరికాదన్నారు. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులు వచ్చాయని మర్చిపోవద్దని, నిబంధనలను అతిక్రమించొద్దని సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పాదయాత్ర చేసుకునే హక్కు అందరికీ ఉందని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు మాత్రం ఊరుకోరన్నారు. గతంలో పాదయాత్ర ఆగిపోవడానికి ఆమె బాధ్యురాలని చెప్పారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటివరకు చెప్పులు, బూట్లు తొడగనట్లుగా వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారని, ఆమె పాదయాత్ర చేసుకుంటే బీఆర్ఎస్కు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ‘నేను పులివెందులకు వస్తాను. మీ అన్న జగన్ అక్కడ సీఎం కదా.. మీ అన్న నాతో పాదయాత్రకు వస్తారా’ అని ప్రశ్నించారు.
నర్సంపేట నియోజకవర్గంలోని లింగగిరిలో షర్మిల పాదయాత్ర మళ్లీ ప్రారంభం అవుతున్నట్లు తెలిసిందని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎవరూ ఊరుకునే ప్రశ్నే లేదన్నారు. కోర్టు తీర్పును అనుసరించి నిబంధనల ప్రకారం పాదయాత్ర చేసుకుంటే మంచిదని అన్నారు. ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కూడా గతంలో పాదయాత్ర చేశారని, ఆయన ఇలా మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. వెంటనే ఆమె మాటలను వెనక్కి తీసుకోవాలని కోరారు. రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ అస్థిత్వం, ఉద్యమ నేపథ్యం, ఉద్యమకారులను అవమానించే విధంగా మాట్లాడితే ప్రజాక్షేత్రంలో నిరసనలు తప్పవని స్పష్టం చేశారు. నర్సంపేటలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా కుల సంఘాలకు భవనాలను నిర్మించేందుకు ఏడున్నర కోట్లు నిధులు మంజూరు చేయిస్తే ఓ కాంగ్రెస్ నాయకుడు కోర్టుకు వెళ్లి ఆ పనులను నిలుపుదల చేయించారని తెలిపారు.
ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే నేరుగా బడ్జెట్ నుంచే రూ.15 కోట్లు మంజూరు చేయించారన్నారు. త్వరలోనే భవనాల నిర్మాణం కొనసాగుతుందన్నారు. నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారని, కానీ, రైతులకు వస్తున్న సబ్సిడీలను ఎత్తి వేయడం తగదన్నారు. వ్యవసాయ రంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. బడ్జెట్లో రైతులను అన్యాయం చేసిందని, ఇప్పుడు కేంద్ర మంత్రులు, గుండోడు, బండోడు కూడా ఏం మాట్లాడడం లేదన్నారు. రైతుల కోసం బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి సభ్యుడు రాయిడి రవీందర్రెడ్డి, నల్లా మనోహర్రెడ్డి, గుంటి కిషన్, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, సత్యనారాయణ, మోహన్రెడ్డి, శ్రీధర్రెడ్డి, జుర్రు రాజు, నాగిశెట్టి ప్రసాద్, రాజు, రాంబాబు, గోల్యానాయక్, పాషా, చంద్రమౌళి, సదానందం, కుమారస్వామి, రాజేశ్వర్, యువరాజు, రాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.