ఖానాపురం, జూలై 12: అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉమ్మడి మంగళవారిపేట గిరిజన రైతులకు పట్టాలిచ్చాకే ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నానని, హక్కుపత్రాలను రైతుల చేతుల్లో పెట్టి మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నానని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం బండమీది మామిడితండా, మనుబోతులగడ్డ, నాజీతండా, వేపచెట్టుతండా, భద్రుతండా, ధర్మరావుపేట గ్రామాల్లో 1,788 ఎకరాల భూమికి సంబంధించి 913మంది పోడురైతులకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హక్కుపత్రాలను పంపిణీ చేశారు. పలు గ్రామాలు, తండాల్లో ఎమ్మెల్యే పెద్దికి డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు.
గిరిజనులు తమ సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. వేర్వేరుచోట్ల ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో వేలాది మంది పోడు రైతులకు హక్కుపత్రాలు ఇచ్చే దమ్ము బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలా వచ్చిందని, గతంలో రాష్ర్టాన్ని పరిపాలించిన ప్రతిపక్షాలకు ఎందుకు సాధ్యంకాలేదో ప్రజలు ఆలోచించాలని కోరారు. రైతులకు హక్కు పత్రాలు అందించడమే కాకుండా, పెట్టుబడిసాయం కింద రైతుబంధు, రైతుబీమా వర్తింపజేసిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అన్నారు. పోడు రైతులు హక్కుపత్రాలకు చేసుకున్న 98 శాతం దరఖాస్తులను ఆమోదించామని చెప్పారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా పరిపాలన చేస్తున్నానని, ప్రజల మద్దతు తప్పకుండా తనకు ఉండాలని కోరారు. కొందరు రైతులు రెండుచోట్ల పోడు సాగు చేసుకున్నారని వారికి త్వరలో సర్వే చేయించి న్యాయం చేస్తానన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పోడు సాగు చేసుకున్న రైతులకు సర్వే చేయించి పట్టాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
మంగళవారిపేటకు పట్టాలిప్పించేందుకు కృషిచేశా
70 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని మంగళవారిపేట భూములకు పట్టాలిప్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశానని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. సీఎం కేసీఆర్ను, వివిధ శాఖల అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను, బీఆర్ఎస్ నాయకులను సమన్వయం చేసుకుంటూ పట్టువదలకుండా కష్టపడితేనే పట్టాలు వచ్చాయని గుర్తుచేశారు. ఆర్థికంగా ఎంతో ఖర్చుచేశానని, ఆరు నెలల తన జీతాన్ని వెచ్చించానని చెప్పారు. మంగళవారిపేట భూములకు పట్టాలిచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనను మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మంగళవారిపేట భూములకు పాకాల జలాలను సాధించి తీరుతానన్నారు. మంగళవారిపేటలోని గిరిజనేతరుల భూములకు కూడా న్యాయం చేస్తానని అన్నారు.
కొందరు రైతులు అవగాహన లోపంతో దరఖాస్తు చేసుకోలేదని వారికి మరోసారి అవకాశం కల్పించి హక్కుపత్రాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని అన్నారు. నాజీతండాను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. వారం రోజుల్లో వందశాతం సీసీ రోడ్లను మంజూరు చేస్తానన్నారు. ఒక్కసారి తనను అసెంబ్లీకి పంపితే నియోజకవర్గంలో 70 ఏళ్లలో చేయని పనులను పూర్తిచేశానని, మరోసారి అవకాశం కల్పిస్తే కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకట నర్సయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, సర్పంచ్లు బాలకిషన్, పద్మావతి, పద్మ, సోమయ్య, లక్ష్మీ, రమేశ్నాయక్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పెద్దికి రుణపడి ఉంటాం
ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నా మా భూములకు ఎలాంటి పట్టాల్లేవు. బ్యాంకులు లోన్లు ఇచ్చేవి మా భూముల సమస్యను ఎన్నో ప్రభుత్వాలకు చెప్పినం. ఎవరూ పరిష్కరించలేదు. కానీ గత ఎన్నికల ముందు పెద్ది సుదర్శన్రెడ్డి మాకు హామీ ఇచ్చాడు. ఇప్పుడు మా తండాకు ఇచ్చి మా చేతుల్లో హక్కుపత్రాలు పెట్టిండు. ఇది కలో నిజమో తెలియడం లేదు. చాలా సంతోషంగా ఉంది. నాకు 2.07 ఎకరాలు ఉంది. రైతుబంధు డబ్బులు ఖాతాలో పడ్డాయి. మాకు హక్కుపత్రాలు ఇప్పించిన మహానుభావుడు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి ఉంటాం.
– భూక్య లక్ష్మణ్, వేపచెట్టుతండా