జనగామ, జూలై 14(నమస్తే తెలంగాణ) : దేవాదుల పంపులు, పైపులైన్ల నిర్వహణ లోపంతో ప్రభుత్వం, సంబంధిత అధికారులు రైతుల నోట్లో మట్టికొడుతున్నారని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటలు ఎండిపోతుండగా ధర్మసాగర్ నుంచి తపాస్పల్లి, గండిరామారం రిజర్వాయర్లకు పంపింగ్ నిలిచిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన పైపులైన్లకు మరమ్మతు చేసి రెండు పంపుల ద్వారా నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లను నింపి రైతుల పంటలను కాపాడాలని ఆయన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను కోరారు.
రెండో పంపును ఆన్ చేయాలని గత శనివారం ఫోన్లో మాట్లాడి ఒత్తిడి తెచ్చిన పల్లా సోమవారం సైతం మరోసారి అధికారులతో సమీక్షించారు. రైతులు వానకాలం సీజన్లో వేసుకున్న నారుమడులు ఎండిపోతున్నాయని, అదునులో వర్షాలు పడక, దేవాదుల రిజర్వాయర్లు నిండక రైతులు గగ్గోలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మసాగర్ నుంచి గండిరామారం వెళ్లే పైపులైన్ పగిలిపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.
నాలుగు పంపుల్లో ఏడాదిలో కనీసం రెండు పంపులైనా సరిగా పనిచేశాయా? పంపులు, పైపులైన్ల మెయింటనెన్స్ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. రెండో మోటర్ ఆన్ చేయమని అడిగితే ఉన్న ఒక్క మోటర్ కూడా నడవకుండా చేశారని, యుద్ధప్రాతిపదికన పైపులైన్ మరమ్మతు చేసి రెండు పెద్ద పంపులు ఆన్ చేయాలని కోరారు. సమ్మక్క బరాజ్ వద్ద నీళ్లు, పంపులు, కరెంటు ఉన్నాయని, కేవలం నిర్వాహణ సరిగా లేదని, గత ఏడాది ఇదే సమస్యతో నెలరోజులు పంపులు బంద్ చేవారని, ఇప్పుడు మళ్లీ నెల నుంచి ఒక్క పంపు కూడా నడవలేదన్నారు. ఇదే ఇబ్బంది తరచూ వస్తున్నదని, అధికారులైన మిమ్మల్ని ఏమనాలి? ప్రభుత్వాన్ని ఏమనాలి? అందరూ కలిసి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఎమ్మెల్యే పల్లా ఆవేదన వ్యక్తం చేశారు.