ఖిలావరంగల్, మార్చి 17: పకీర్లకు ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం రాత్రి నర్సంపేట రోడ్డులోని అబ్నుస్ ఫంక్షన్హాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ పకీర్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సోయి గత పాలకులు విస్మరించారని అన్నారు. ఎన్నికలు సమీపిస్తుంటే అధికార దాహంతో వద్దకు వస్తున్నారని, ఇంతకాలం వీళ్లంతా ఎక్కడికి పోయారని విమర్శించారు.
ఎనిమిదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. మైనారిటీ పిల్లలకు నాణ్యమైన విద్య నియోజకవర్గానికి మూడు గురుకులాలు తీసుకువచ్చినట్లు తెలిపారు. రూ.1,100కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో ఉందన్నారు. పేదల జనావాసాల మధ్యకు కలెక్టరేట్ తీసుకువచ్చామని తెలిపారు. నిరుపేద పకీర్ కుటుంబాలను ఆదుకుంటామన్నారు. గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షలు, లేనివారికి డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. పకీర్ల కోసం ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామన్నారు. రాష్ట్ర పకీర్ల సంఘం అధ్యక్షుడు ఫక్రోద్దీన్, జిల్లా అధ్యక్షుడు ఎండీ ఉల్ఫత్, కార్పొరేటర్లు సురేష్ జోషి, ఫుర్ఖాన్, మాజీ కార్పొరేట్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.