Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టై 1100 రోజులు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆయన తనయుడు కాసిం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి ఆరోగ్యం బాగా లేదని, ఈ విషయంలో ప్రపంచం స్పందించి, సాయం చేయాలని కాసిం ఖాన్ కోరారు. ఇమ్రాన్కు అత్యవసర వైద్య చికిత్స అవసరమని, లేకుంటే ఆయన కంటిచూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ ప్రధానిగా పని చేసిన ఇమ్రాన్ఖాన్ను తాజా ప్రభుత్వం 2023, ఆగష్టు 5న అరెస్టు చేసింది.
అప్పటినుంచి ఆయన రావల్పిండిలోని అడియాలా జైలులో ఖైదీగా ఉన్నారు. ఆయనను తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. ఇతర కేసుల్లో కూడా ప్రభుత్వ అతడిని అరెస్టు చేసి, జైలులో ఉంచింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన బెయిల్పై కూడా విడుదల కాలేదు. ఆయనను కలిసేందుకు కూడా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అనుమతివ్వడం లేదు. తక్కువసార్లు మాత్రమే ఆయనను కుటుంబ సభ్యులు కలిశారు. ఇమ్రాన్ను కలిసి కొన్ని నెలలు అవుతోందని తనయుడు సులైమాన్ ఖాన్ చెప్పారు.
గత మార్చి నుంచి తాను, తన సోదరుడు కాసిం ఖాన్ తమ తండ్రిని కలవలేదని అన్నాడు. తండ్రిని కలిసేందుకు అనుమతించడం లేదన్నాడు. ప్రస్తుతం కాసిం ఖాన్, సులైమాన్ ఖాన్.. ఇద్దరూ బ్రిటన్లో నివసిస్తున్నారు. తమ తండ్రి ఆరోగ్యం బాగాలేదని, అతడికి అత్యవసర చికిత్స అవసరమని వారు అంటున్నారు. ఈ విషయంలో ప్రపంచం స్పందించి, తమకు సాయం అందించాలని కోరుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇమ్రాన్ను కలిసేందుకు పాక్ ప్రభుత్వం ఎవరినీ అనుమతించడం లేదు. ఆ సమయంలో ఇమ్రాన్ సోదరి పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ గురించి అభ్యంతరకవ్యాఖ్యలు చేశారు.
అప్పటినుంచి ఇమ్రాన్ను కలిసేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తోంది. గత ఫిబ్రవరి 14న పలువురు అంతర్జాతీయ రిటైర్డ్ క్రికెటర్లు పాక్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇమ్రాన్ను విడుదల చేయాలని, ఆయనకు న్యాయ సహాయం అందించాలని కోరారు. కానీ, పాక్ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు.