వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 19 : బీఆర్ఎస్ హయాంలోనే దేవాలయాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం మహా శివరాత్రి సందర్భంగా మహా జాగరణ కార్యక్ర మం నిర్వహించారు. లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి, వేములవాడ, కొండగట్టు తదితర దేవాలయాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. భద్రకాళి గుడికి మాడవీధులు, గాలి గోపుర నిర్మాణ పనులకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రామప్ప, వెయ్యి స్తంభాల రుద్రేశ్వరాలయానికి సైతం నిధులు అందించామని చెప్పారు. వేడుకలను విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం, పేరిణి నృత్యాలను వీక్షించారు. భారీ సెట్టింగుల మధ్య విద్యుత్ దీపాల అలంకరణలో ఏర్పాటు చేసిన శివలింగాన్ని వీక్షించడానికి భారీగా ప్రజలు, భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
అర్ధనారీశ్వరుడి అలంకరణలో శంభులింగేశ్వరుడు..
ఖిలావరంగల్ : ఓరుగల్లు కోటలో మూడు రోజులు కొనసాగిన మహా శివరాత్రి వేడుకలు ఆదివారం ముగిశాయి. శనివారం అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ఆలయ అర్చకుడు శీలమంతుల శంభులింగం పంచామృతాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర హాజరయ్యారు. ఆలయం ప్రాంగణంలోని చతుర్ముఖ లింగాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఖుష్మహల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఆయన వెంట 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమ ఉన్నారు. ఆదివారం శంభులింగేశ్వరుడికి అన్నపూజ చేసి అర్ధనారీశ్వరుడిగా అలంకరించారు. శివనగర్లోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగిన శివ పార్వతుల కల్యాణానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.