న్యూఢిల్లీ, జూలై 25: నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై విద్యార్థులు చేపట్టిన నిరసనకు తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన దరిమిలా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రతిష్టపై దీని ప్రభావం ఏ రకంగా ఉంటుందనే విషయమై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో పెద్ద నోట్ల రద్దు, రైతుల ఉద్యమం వంటి వివాదాలు దేశవ్యాప్తంగా బీజేపీకి పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగించనప్పటికీ విద్య, ఉపాధి వంటి అంశాలు కోట్లాది మంది యువత జీవితాలను నేరుగా ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నందున విద్యార్థుల ఉద్యమం కచ్చితంగా ప్రభుత్వ ప్రతిష్టపైన, ప్రధాని మోదీ వ్యక్తిగత ప్రజాదరణపైన ప్రతికూల ప్రభావం చూపుతాయని అంచనా వేస్తున్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో నీట్ యూజీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీబీఐ జరుపుతున్న దర్యాప్తులో వ్యవస్థాగత లోపాలు, వ్యక్తిగతంగా అధికారుల బాధ్యతా రాహిత్యం కారణమని తేలిన పక్షంలో అది ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపగలదని వారు భావిస్తున్నారు. అంతేగాక పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సంస్కరణలు ప్రజల విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరించడంపై కూడా ఇది ఆధారపడి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న చట్ట సవరణలతో భవిష్యత్తులో పరీక్షల అక్రమాలు పూర్తిగా ఆగిపోతేనే ప్రభుత్వం పట్ల ప్రజల్లో మళ్లీ విశ్వాసం ఏర్పడగలదని, అలా జరగని పక్షంలో ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడగలదని విశ్లేషకులు పేర్కొన్నారు.
అంతేగాకుండా ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఏర్పడిన అసంతృప్తిని ప్రతిపక్షాలు దీర్ఘకాలిక రాజకీయ మద్దతుగా మార్చుకునే అవకాశం కూడా లేకపోలేదని అంచనా వేస్తున్నారు. మోదీ ప్రభుత్వం అర్థవంతమైన సంస్కరణలు చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి పరీక్షల అక్రమాలను నివారించగలిగితే ధర్మేంద్ర రాజీనామా వల్ల కలిగే రాజకీయ నష్టం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. అయితే మరిన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చినా లేదా సంస్కరణలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ రాజీనామా ప్రజల్లో ముఖ్యం గా విద్యార్థులు, యువత దృష్టిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను తీసుకువచ్చే అవకాశం ఉందన్నది పరిశీలకుల అంచనా.