కరీమాబాద్, జూలై 25: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఉర్సు, కరీమాబాద్, రంగశాయిపేట ప్రాంతంలోని కురుమ కులస్తులు తమ ఇలవేల్పు అయిన బీరన్న స్వామికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఉదయం ఉర్సులోని కురుమ కుల సంఘం అధ్యక్షుడు యేర కోటేశ్వర్ ఆధ్వర్యంలో జెండా చేత బూని స్వామి వారికి పట్టువస్ర్తాలు, బండారి, కంకణాలను అందజేశారు. అనంతరం సాయంకాలం మహిళలు నెత్తిన బోనాలతో ఆలయానికి తరలివెళ్లారు. దారి పొడవునా డప్పుచప్పుళ్లు మార్మోగాయి. బీరన్నల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కురుమ కుల పెద్ద మరుపల్ల రవి బోనం ముందు సాగగా బోనాలు ఆలయానికి బయలుదే రాయి. స్వామి వారికి నైవేద్యం సమర్పించి తిరిగి ఇళ్లకు బయలుదేరారు.
కరీమాబాద్లోని ఆలయ కమిటీ సభ్యులు ఉదయం జాతీయ జెండాను చేతబూని ఆలయానికి వెళ్లి ఆలయంలోని చెట్టుకు జెండాను కట్టారు. అనంతరం సాయంకాల రామస్వామి కుల పెద్ద బోనం ముందు రాగా గుడి నుంచి బోనాలు బయలుదేరాయి. ఊరంతా తరలివచ్చి బోనాలను, బీరన్నల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. బోనాలు బురుజు సెంటర్లోకి రాగానే బీరన్నలు గొర్రెను గావు పట్టారు. గావును చూసేందుకు వందలాది మంది జనం అక్కడకు వచ్చారు.

అనంతరం గావు పట్టిన గొర్రె పిల్లను బోనాలతో దాటుతూ మహిళలు ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారి కల్యాణం నిర్వహించి కురుమలు ఇళ్లకు బయలుదేరారు. రంగశాయిపేటలో మహిళలు నెత్తిన బోనాలతో ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రటి ఏటా బీరన్న స్వామికి బోనాలు చేయడం ఆనవాయితీగా వస్తుందని కురుమలు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు బోనమెత్తారు.