గిర్మాజీపేట, అక్టోబర్ 21: రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ తలరాతను మార్చారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 25వ డివిజన్ మండిబజార్ నిజాంపురలోని డైమండ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాత్రి వివిధ పార్టీల నుంచి మొయినోద్దీన్ మిత్ర బృందం 100 మంది, జన్ను స్కైలాబ్ మిత్ర బృందం 50 మందితో కలిపి మొత్తం 150 మంది బీఆర్ఎస్లో చేరగా, వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నన్నపునేని మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకుంటున్నారన్నారు. రాష్ట్రం కనీవినీఎరుగని రీతిలో అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు, గృహలక్ష్మి, దళితబంధు, మైనార్టీల రుణాలు, బీసీ రుణాల పథకాల ద్వారా తూర్పు నియోజకవర్గంలోని లబ్ధిదారులకు సాయం అందుతున్నదని గుర్తుచేశారు. నియోజకవర్గంలో ఏడు గురుకులాలు ఏర్పాటు చేసి, పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. తూర్పు ప్రజలకు సేవ చేయడమే నా జీవిత లక్ష్యమన్నారు. ప్రజలు కారుగుర్తుకు ఓటు వేసి మరోసారి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 25వ డివిజన్ ఇన్చార్జితోపాటు డివిజన్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల ఖర్చు కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగి కట్ల వెంకటేశ్ తనవంతు సాయంగా నన్నపునేనికి రూ. 10 వేలు అందించారు. అలాగే, పెరుకవాడ రైల్వేగేట్లో శ్రీహనుమాన్ నవయువత గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, ఎస్ఆర్ఆర్తోట 60 ఫీట్రోడ్ వద్ద ఆకుతోట రమేశ్-అనురాధ దంపతులు ఏర్పాటు చేసిన అమ్మవార్ల విగ్రహాల వద్ద ఎమ్మెల్యే పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్, డివిజన్ ఇన్చార్జి కోటేశ్వర్, డివిజన్ అధ్యక్షుడు ఎం.వినయ్కుమార్, బీఆర్ఎస్ నేత గుమ్మడి దాసు పాల్గొన్నారు.
కరీమాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్తోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. వరంగల్ ఫోర్టురోడ్డులోని క్యాంపు కార్యాలయంలో 32వ డివిజన్ అధ్యక్షుడు, సోషల్ మీడియా ఇన్చార్జి ఒంటెల ప్రసాద్ టీఆర్ఎస్లో చేరారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే అన్నారు.
ఖిలావరంగల్: శివనగర్లో దేవీ భ్రమరాంబిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలకు ఎమ్మెల్యే నరేందర్ హాజరై పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. దేవీ భ్రమరాంబిక ఉత్సవ కమిటీ సభ్యులు పగడాల సతీశ్, పొనకంటి కృష్ణకుమారి, బారిశెట్టి ఉమ, పారిజాతం వైష్ణవి, బీ ఉమ, తొగరు వేణు పాల్గొన్నారు. శివనగర్ రామాలయంలో లలితాదేవి సహస్రనామస్తోత్రం పారాయణం చేశారు. అనంతరం మహిళలు కుంకుమ పూజ నిర్వహించారు. శివనగర్లోని ఆర్యవైశ్య భవంనలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.