Stock Market : భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా ఐదోరోజు నష్టాల్లో ముగిసింది. మార్కెట్ నష్టాల్లో ముగియడం మదుపర్లకు ఆందోళన కలిగిస్తోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 331 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ ఆటో, రియాల్టీ, ఫార్మా షేర్ల అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్ నష్టాల బాటలో సాగింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, దీని కారణంగా ద్రవ్యోల్బణం పెరగుతుందనే భయం, చమరు ధరలు పెరగడం వంటివి మార్కెట్ వరుస నష్టాలకు కారణం.
ఉదయం సెన్సెక్స్ 75,708.19 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఒక దశలో 75,474.43 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. చివరకు 331.62 పాయింట్ల నష్టంతో 76,059.77 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 102.15 పాయింట్ల నష్టంతో 23,767.45 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎల్ అండ్ టీ పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ఇన్ఫోసిస్ షేర్ ఒక శాతం పడిపోయింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర పెరుగుతోంది. శుక్రవారం బ్యారెల్ క్రూడాయిల్ ధర 97.68 డాలర్లుగా ఉంది. బంగారం ఔన్స్ ధర 4059 డాలర్ల వద్ద కొనసాగింది. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ 96.57గా ఉంది.