రైతును రాజు చేయడమే సీఎం ధ్యేయం
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
వెల్దండలో క్రీడా ప్రాంగణానికి ప్రారంభోత్సవం, పాఠశాల ప్రహరీకి భూమిపూజ
నర్మెట, జూన్ 28: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని వెల్దండలో క్రీడా ప్రాంగణాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. మన ఊరు-మన బడి కార్యక్రంమలో భాగంగా రూ.13 లక్షలతో ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన ప్రహారీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పల్లెల అభివృద్ధిని విస్మరించాయన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పల్లెలు, తండాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతామని యత్నిస్తున్నదని, దీనిని సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. యాసంగి సీజన్లో పండిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుంటే ఆర్థికభారమైనా కేసీఆర్ ముందుకొచ్చి కొనుగోలు చేయించారని ఆయన గుర్తు చేశారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నేత లు బండి సంజయ్, రేవంత్రెడ్డి రాష్ర్టానికి రావాల్సిన న్యాయబద్దమైన వాటా విషయంలో కేంద్రాన్ని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం
‘మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు పెరిగి బలోపేతం అవుతున్నాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. వెల్దండలోని పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.6 లక్షలు, కిచెన్ షెడ్డుకు రూ.3.40 లక్షలు, ప్రహారీగోడకు రూ.13 లక్షలు, ఎలక్ట్రికల్ ఖర్చులకు రూ.3 లక్షలు, క్రీడా ప్రాంగణానికి రూ.6 లక్షలు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్, సర్పంచ్ నర్ర వెంకటరమణారెడ్డి, వైస్ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి, టీఆర్ఎస్ నర్మెట, తరిగొప్పుల మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, నర్మెట మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కల్యాణం మురళి, జడ్పీ కోఅప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, మాజీ మండల అధ్యక్షుడు నీరేటి సుధాకర్, యూత్ మండల అధ్యక్షుడు పార్నంది సతీశ్శర్మ, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు ఎలబోయిన నరేశ్, నాయకులు పగడాల నర్సయ్య, కంతి రాజలింగం, రమేశ్, గడపురం శశిరత్, బైరగోని రవీందర్, నక్కల రవి, పాకనాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.