హనుమకొండ, మార్చి 7 : ‘మోసానికి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని, అమలు కానీ హామీలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచి, అప్పుల పాలు చేసిందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. సాగు, తాగు నీరు లేక కరెంటు కష్టాలతో రైతులకు మళ్లీ పాత రోజులు రానున్నాయన్నారు. గురువారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల కావస్తున్నా పూర్తి స్థాయిలో హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 31వ తేదీలోగా రైతులందరికీ రైతు బంధు డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినప్పటికి మూడు ఎకరాలున్న రైతులకు కూడా రైతుబంధు రాలేదని పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాచలం రాముడి సన్నిధిలో ప్రారంభిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నదని ఎద్దేవా చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3,500ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50లక్షల ఇండ్లు నిర్మిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో కేవలం రూ. 7,740కోట్లు మాత్రమే కేటాయించిందని, ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలంటే రూ.25వేల కోట్లు కావాలని కడియం తెలిపారు. ప్రజాపాలన సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీ మాత్రమే జరిగిందని, ఇప్పటివరకు విధివిధానాలు రూపొందించలేదని, పథకానికి సరిపడా నిధులు కేటాయించకుండా ప్రారంభించడమంటే తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. ఈ నెల 11న పథకం ప్రారంభిస్తామని చెప్పారని, 13,15వ తేదీల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, అదే జరిగితే కోడ్ అమలులో ఉందని పథకం అమలు చేయడం సాధ్యం కాలేదని చెప్పేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులు ఉన్నవారు 90లక్షల మంది ఉంటే నిబంధనల పేరుతో 29లక్షల మందికే రూ. 500గ్యాస్ పథకం అమలు చేస్తున్నారన్నారు. అలాగే 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అని చెప్పి అంతకు మించి ఒక్క యూనిట్ ఎక్కువ కాల్చినా మొత్తం యూనిట్లకు బిల్లు చెల్లించాల్సిందేనని నిబంధన పెట్టడం బాధాకరమని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్, సింగరేణి, గురుకుల టీచర్లు ఇలా అనేక నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి పైనల్ జాబితా ప్రకటించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందనడం ఇంతకన్నా సిగ్గులేని అంశం మరొకటి లేదన్నారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడనున్నాయని, సాగునీటి కష్టాలు రానున్నాయని అన్నాడంటే వాటర్ మేనేజ్మెంట్ విషయంలో సీఎంకు అవగాహన లేదని అర్థం అవుతున్నదన్నారు. రిజర్వాయర్లు ఎండిపోయి భూగర్భ జలాలు తగ్గతుండడంతో అధికారులు, రైతులను అప్రమత్తం చేయకుండా ప్రతిపక్షాలపై సీఎం విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎంగా ఉండి రాష్ట్ర పరిపాలన, రాబోయే పరిస్థితులను అంచనా వేయడంలో రేవంత్రెడ్డికి అవగాహన లేకపోవడం సిగ్గుచేటన్నారు. రైతు నేస్తం ప్రారంభం కార్యక్రమంలో సీఎం మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించిన సభలో తన జేబులో ఎప్పుడూ కత్తెర ఉంటుందని, తోక ఆడించేవాడి తోక కత్తిరించేందుకనని అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపి మంత్రులను హెచ్చరిస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు. రేవంత్రెడ్డికి తన కుర్చీ కదులుతుందేమోనని భయం పట్టుకుందని, బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీని కూలదోయాలనే ఆలోచన లేదని అన్నారు. వంద రోజులు గడువక ముందే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు పాల్పడి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పార్టీ మార్చడం సిగ్గు చేటన్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకొని విజయావకాశాలు ఉన్నవారికే టికెట్ ఇస్తారని కడియం స్పష్టం చేశారు.