నడికూడ, మే 31: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు, హమాలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తుందన్నారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన పడొద్దన్నారు. అసత్య ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మవద్దని సూచించారు. రైతులకు అండగా ఉండి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులకు వారు చేస్తున్న మేలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. అక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తెలంగాణలో మాత్రం బీజేపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఊర రవీందర్రావు, పార్టీ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, మాదారం సొసైటీ చైర్మన్ నల్లెల లింగమూర్తి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తిప్పర్తి సాంబశివారెడ్డి, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ సుదాటి వెంకన్న, దళిత బంధు జిల్లా సభ్యుడు మచ్చ రవీందర్, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పాలనలోనే ఆలయాలకు గుర్తింపు
పరకాల : బీఆర్ఎస్ పాలనతో ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని కుంకుమేశ్వర ఆలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపనకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి ధ్వజస్వంభాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఆలయాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టాడన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనితా రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, డైరెక్టర్ నక్క చిరంజీవి, ఆలయ కమిటీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు, దాతలు చందుపట్ల ఇంద్రసేనారెడ్డి, సుదర్శన్రెడ్డి, కమలాకర్రెడ్డి, నిరంజన్రెడ్డి, విజేందర్రెడ్డి, దేవేందర్రెడ్డి, నర్సింహారెడ్డి, విక్రమ్రెడ్డి, సుధీర్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.