పరకాల, ఆగస్టు 27 ; ప్రజలే నా బలం.. బలగం అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. టికెట్ ఖరారైన నేపథ్యంలో చల్లా ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. 61 సంవత్సరాల్లో కాని అభివృద్ధి తొమ్మిదిన్నరేండ్లలోనే జరిగిందని, పరకాల నియోజకవర్గ రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. విపక్ష నాయకులు చిల్లరమల్లరగా మాట్లాడడం మానుకోవాలని, ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు విపక్షాలకు అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు రాష్ట్రానికే తలమానికమని, సీఎం కేసీఆర్ పాలనలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ మరోసారి మీకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించడంపై మీ స్పందన ఏమిటి? మూడో సారి ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై ఎలా ఫీలవుతున్నారు.
ఎమ్మెల్యే చల్లా : సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆలోచన తెలిసిన గొప్ప వ్యక్తి. రానున్న ఎన్నికలకు ఒకే సారి 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడం సాహసోపేత నిర్ణయం. సీఎం కేసీఆర్ నన్ను పరకాల బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం నా అదృష్టం, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక పరకాల నియోజకవర్గంలో ప్రజల తీర్పు ప్రత్యేకమైనది. స్థానికంగా ప్రజలు అభివృద్ధికే పట్టం కడుతారని పలుమార్లు రుజువయ్యింది. ఇక్కడ ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే నా కంటే ముందు ఇద్దరు మాత్రమే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. నేను రెండు పర్యాయాలు గెలువడంతో పాటు మూడో సారి పోటీలో నిలుస్తున్నా. ఇది నిజంగా నియోజకవర్గ ప్రజలు నాపై చూపుతున్న ప్రేమ, అభిమానాల వల్లనే సాధ్యమైంది. ప్రజల ప్రేమ, అభిమానికి నేను రుణపడి ఉంటా.
నమస్తే తెలంగాణ : నియోజకవర్గ ప్రజలతో మీకున్న అనుబంధం ఎలాంటిది?
ఎమ్మెల్యే : నియోజకవర్గ ప్రజలకు నాకు ఉన్న అనుబంధం చాలా గొప్పది. 2008 నుంచి నేను ప్రజల్లో ఉన్నా. 2009 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకున్నా.. ప్రజల్లో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నా. 2012లో పరకాల నుంచి పోటీ చేసి ఓడిపోయా. అయినా ప్రజల్లోనే ఉన్నా. ఇంటింటికీ చల్లా అనే కార్యక్రమంలో నియోజకవర్గలోని ప్రతి ఇంటికి వెళ్లా. ప్రజలు కష్టసుఖాలు తెలుసుకుని వారి కుటుంబాల్లో ఒక్కడినయ్యా. ‘నన్ను గెలిపించండి అభివృద్ధి అంటే ఎంటో రుచి చూపిస్తా’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లినా. దీంతో నన్ను నమ్మిన ప్రజలు 2014లో గెలిపించారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ముందుకు నడుస్తున్నా. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా నన్ను ప్రజలు ఆప్యాయంగా వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కడిగా చూస్తారు.
నమస్తే తెలంగాణ : ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు?
ఎమ్మెల్యే : ఉమ్మడి రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉంది. మౌలిక వసతులు, రవాణా వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్వరాష్ట్రం సిద్ధించడం, నేను ఎమ్మెల్యేగా గెలువడంతో నియోజకవర్గ అభివృద్ధికి దశల వారీగా, ప్రణాళిక బద్ధంగా కృషి చేశా. నియోజకవర్గ స్థితిగతులను సీఎం కేసీఆర్కు నేరుగా వివరించడంతో ఆయన ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. పరకాల రెవెన్యూ డివిజన్ ఇక్కడి నుంచి తరలిపోతే 30 ఏండ్లు ఎవ్వరూ పట్టించుకోలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరకాలను మళ్లీ రెవెన్యూ డివిజన్ చేశా. నియోజకవర్గ కేంద్రంలోనే అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా అన్ని మండలాల్లో సమాంతరంగా అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకున్నా. నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులు గుర్తించి రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేశా. ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్లు ఉండేలా విస్తరించా. రూ.వందల కోట్లతో రోడ్ల నిర్మానం చేపట్టా. ఆత్మకూరు, గీసుకొండలో జూనియర్ కళాశాలకు నూతన భవనాలను నిర్మించుకున్నాం. పరకాలలో నూతన మున్సిపాలిటీ భవనం, ఆర్డీవో కార్యాలయం, మూడు మండలాల్లో కొత్త తహసీల్ కార్యాలయాలు నిర్మించాం. వంద పడకల దవాఖాన నిర్మాణం వేగంగా సాగుతోంది. మూసివేతకు సిద్ధంగా ఉన్న డిగ్రీ కళాశాలలో దోస్త్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, విద్యార్థుల సంఖ్యను పెంచాం. పాలిటెక్నిక్ కళాశాలకు శాశ్వత భవనాన్ని నిర్మించుకుని అందులో ప్రత్యేక హాస్టల్ సదుపాయం కల్పించాం. దీంతో పాటు నియోజకవర్గ్గానికి 5 సంక్షేమ గురుకులాలను తీసుకొచ్చా. గీసుకొండ మండలంలో నిర్మించిన కొనాయిమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో మండలంలోని 18వేల ఎకరాలకు, సంగెం మండలం బొల్లికుంట వద్ద జాతీయ రహదారి మీద దేవాదుల కాలువపై కట్టిన బ్రిడ్జి, పూర్తి చేసిన కాలువ నిర్మాణంతో మండలంలో 38,500 ఎకరాలకు అదనంగా సాగునీరు అందుతోంది. గంగదేవిపల్లి, మరియాపురం లాంటి గ్రామాలు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి పలు అవార్డులు గెలుచుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికే తలమానికంగా ఉన్న ఆజాంజాహి మిల్లు అప్పటి పాలకుల నిర్లక్ష ్యంతో కనుమరుగైంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఒక భారీపరిశ్రమను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో నియోజకవర్గంలోని సంగెం, గీసుకొండ మండలాల పరిధిలో 1350 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు. ఇది పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇందులో 80శాతం వరకు స్థానికులకే ఉపాధి ఉంటుంది.
నమస్తే తెలంగాణ : నియోజకవర్గంలో విపక్షాల పరిస్థితి ఏంటి? కాంగ్రెస్, బీజేపీపై మీ అభిప్రాయం?
ఎమ్మెల్యే : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయాలకతీతంగా పూర్తి స్థాయిలో అమలవుతున్నాయి. దీంతో చాలా వరకు విపక్షాలకు చెందిన ఎంతో మంది నాయకులు, శ్రేణులు అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ఇప్పటికే బీఆర్ఎస్లో చేరారు. రానున్న ఎన్నికల లోపు విపక్ష పార్టీలు కనుమరుగు కావడం ఖాయం. ఎన్నికలకు ఇంకా మూడు నెలలే ఉన్నా ఇప్పటి వరకు విపక్షాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసే నాయకులు లేకపోవడం ఆయా పార్టీలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ రైతు లు, పేద, మధ్యతరగతి ప్రజల సొమ్మును దోచుకుని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతోంది. ఇక తెలంగాణ ప్రాంతం వెనుకబాటుతనానికి కారణం కాంగ్రెస్ పాలనే. వారి వల్లే కరువు ప్రాంతంగా మారింది. వారు తెలంగాణను దోచుకున్నారే తప్ప ఈ ప్రాంతానికి వారు చేసిందేం లేదు. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసు. వారు ఎప్పటికీ మర్చిపోరు.
నమస్తే తెలంగాణ : రానున్న రోజుల్లో నియోజకవర్గానికి, ప్రజలకు ఎలాంటి విజన్తో అందుబాటులో ఉంటారు? ఎలాంటి కార్యక్రమాలు చేపడుతారు?
ఎమ్మెల్యే : అప్పటికీ ఇప్పటికీ నా నినాదం.. ‘గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో రుచి చూపిస్తా..’. తొమ్మిదిన్నరేండ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా 75శాతం మేర అభివృద్ధి చేసి చూపించా. రానున్న రోజుల్లో మిగిలిన 25 శాతం అభివృద్ధిని పూర్తి చేసి, నియోజకవర్గ్గాన్ని రాష్ట్రంలోనే మోడల్గా తీర్చిదిద్దుతా. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పూర్తి సమయాన్ని కేటాయిస్తా. వారి కుటుంబాల్లో ఒక్కడిగా ఉంటా.
నమస్తే తెలంగాణ : చివరగా నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మీరిచ్చే సందేశం?
ఎమ్మెల్యే : ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక ఎలా అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ఉద్యమకారుడిగా కేసీఆర్ ప్రజల కష్టాలను దగ్గరుండి చూశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల వెనుకబాటు తనం, తెలంగాణ ప్రాంతం ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదో అన్ని తెలుసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఒక విజన్తో సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లుగా అమలు చేస్తూ రాష్ర్టాన్ని దేశానికే మార్గదర్శకంగా మార్చారు. ఇప్పటికే తెలంగాణ పునర్నిర్మాణం, అభివృద్ధి ప్రతి ఒక్కరి కళ్లెదుట కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా.. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా అది సీఎం కేసీఆర్తోనే సాధ్యం. అందుకే మనమంతా కలిసి కేసీఆర్కు అండగా నిలువాలి. కేసీఆర్ను హాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసినట్లయితే రాష్ర్టాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతారు. అందుకు ప్రతి కార్యకర్త, ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలి.