Delimitation Bill : డీలిమిటేషన్ బిల్లుకు తమిళనాడుకు చెందిన డీఎంకే మద్దతు ఇస్తుందా..? పార్లమెంట్లో జరిగిన తాజా పరిణామాలు చూస్తే అవకాశాన్ని కొట్టి పారేయలేం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే పార్లమెంట్లో గురువారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన తేనీటి విందుకు హాజరైన ఏకైక పార్టీ డీఎంకేనే. ఈ పార్టీ తరఫున ఎంపీ కనిమొళి కరుణానిధి తేనీటి విందుకు హాజరయ్యారు. దీంతో డీలిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రానికి డీఎంకే సహకరిస్తుందా అనే సందేహాలు మొదలయ్యాయి. దీనికి అనేక కారణాలున్నాయి. ఇటీవల తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారిపోయాయి.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే ఓడిపోయింది. విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ సహా ఇతర పక్షాల మద్దతుతో విజయ్ టీవీకే అధికారం దక్కించుకుంది. అయితే, ఇంతకాలం తమతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. టీవీకేతో చేతులు కలపడంపై డీఎంకే ఆగ్రహంతో ఉంది. ఇదే నేపథ్యంలో డీఎంకే పార్టీ ఎన్డీయే కూటమికి దగ్గరవుతుందనే ప్రచారం మొదలైంది. పైగా రాజకీయాల్లో శాశ్వత శతృవులు, మిత్రువులు అంటూ ఉండరని ఆ పార్టీ నేతలు అన్నారు. అంటే, ఇంతకాలం వ్యతిరేకించిన బీజేపీ, ఎన్డీయేతో డీఎంకే జట్టు కట్టేందుకు సిద్ధమనే సంకేతాలిచ్చినట్లైంది. ఈ దిశగా ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్డీయే కూటమిలో చేరకపోయినప్పటికీ.. ఆ అవకాశాన్ని మాత్రం పార్టీ పరిశీలిస్తోంది. అందుకే ప్రస్తుతం స్పీకర్ ఇచ్చిన టీ పార్టీకి డీఎంకే నుంచి కనిమొళి హాజరయ్యారు. ఈ తేనీటి విందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు దూరంగా ఉన్నాయి.
నిజానికి డీఎంకే కూడా ఇంతకాలం ప్రతిపక్షంగానే కొనసాగింది. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్డీయేకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే స్పీకర్ ఇచ్చిన పార్టీకి హాజరయ్యారు. అలాగే, కేంద్రం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లుకు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. నిజానికి తమిళనాడులోని అన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. పైగా టీవీకే ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూడా దీనిపై ప్రకటన చేసింది. గతంలో కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు డీఎంకే తెలిపింది. అయితే, తాము పెట్టే కొన్ని కండీషన్స్కు కేంద్రం అంగీకరిస్తే బిల్లుకు డీఎంకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంచనా. దీనిపై త్వరలోనే స్పష్టతరానుంది.