వర్ధన్నపేట, జూన్ 14: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ వైద్య సేవలు కార్పొరేట్ దవాఖానలకు దీటుగా అందుతున్నాయని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వర్ధన్నపేట సీహెచ్సీ ఆవరణలో వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వరంగల్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ గోపాల్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎంపీ పసునూరి దయాకర్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ఎమ్మెల్యే రమేశ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వైద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ కోట్లాది రూపాయల వ్యయంతో దవాఖానలను ఆధునీకరిస్తున్నదన్నారు. పేదలకు ప్రభుత్వ పథకాలు అండగా నిలుస్తున్నాయన్నారు. కొవిడ్ సమయంలో వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సేవల కోసం 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం రూ. 126 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వర్ధన్నపేట పట్టణ ప్రజలకు శుద్ధ జలాలు అందించేందుకు త్వరలో రూ. 84 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ వైద్యులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందించి సత్కరించారు.
సీఎం కృషితోనే మెరుగైన వైద్యం : ఎంపీ
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే రాష్ట్రంలో వైద్యరంగం ఎంతో మెరుగుపడిందని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తే వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయనే భావనతో సీఎం ప్రభుత్వ దవాఖానలు, పాఠశాలలను బలోపేతం చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో కూడా సీఎం కేసీఆర్ను ప్రజలు ఆశీర్వదించాలని ఎంపీ కోరారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ గర్భిణులు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్న వర్ధన్నపేట సీహెచ్సీని త్వరలోనే ప్రభుత్వం 60 పడకల దవాఖానగా మార్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. గ్రామాల్లో ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రభుత్వ దవాఖానలపై అవగాహన కల్పించడం వల్లే రోగులు, గర్భిణులు వస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కలెక్టర్ వైద్య సిబ్బందికి సూచించారు. సమావేశంలో వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీలు అన్నమనేని అప్పారావు, మార్నేని మధుమతి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, కమిషనర్ రవీందర్, ఆత్మ చైర్మన్ గోపాల్రావు, కౌన్సిలర్లు, సూపరింటెండెంట్ డాక్టర్ స్వామి పాల్గొన్నారు.