వర్ధన్నపేట, డిసెంబర్ 18: రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో విద్యా రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇల్లంద ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి గదులు, విద్యుద్దీకరణ, పైకప్పుల మరమ్మతులు, ఫ్లోరింగ్, డైనింగ్ హాల్, వంటగది, ప్రహరీ, అధునాతన ఫర్నిచర్, నీటివసతి, టాయిలెట్స్ తదితర నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ సుంకరి సాంబయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో అరూరి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు.
నిరుపేద కుటుంబాల పిల్లలకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్య అందించాలనే లక్ష్యంలో సీఎం రాష్ట్రవ్యాప్తంగా 700లకు పైగా గురుకుల పాఠశాలలను ప్రారంభించారని వివరించారు. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలతోపాటు మెరుగైన విద్యా బోధన అందించేందుకు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అంతేకాకుండా పాఠశాలల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసి సర్కారు బడుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
టీచర్లు అంకితభావంతో పని చేయాలి
ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో పని చేయాలని అరూరి కోరారు. అలాగే, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా ఎస్ఎంసీలు, నిర్వాహకులు చూడాలన్నారు.
ప్రజాప్రతినిధులు నిత్యం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల అవసరాలను గుర్తించి పనులు చేయించాలని కోరారు. మనఊరు-మనబడిలో చేపడుతున్న పనులను త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అరూరి అధికారులను ఆదేశించారు. అనంతరం ఇటీవల జరిగిన మండలస్థాయి గణిత పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన బాలికలను ఎమ్మెల్యే రమేశ్ అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఎంఈవో రంగయ్య, ఎంపీటీసీలు శ్రీనివాస్, జ్యోతి, ఉపరసర్పంచ్ రాజ్కుమార్, వార్డు సభ్యులు, ఎస్ఎంసీ చైర్మన్ కుమార్, దేవాలయ చైర్మన్ వేణుగోపాల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సర్పంచ్ మృతి పార్టీకి తీరనిలోటు
పర్వతగిరి: రోళ్లకల్ సర్పంచ్ మూడు సాధ్యానాయక్ మృతి బీఆర్ఎస్కు తీరనిలోటని పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఈ సందర్భంగా సాధ్యానాయక్ మృతదేహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బానోత్ సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్, ఎంపీపీ కమల, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, నాయకులు పట్టపురం ఏకాంతంగౌడ్, చింతపట్ల సోమేశ్వర్రావు, సర్వర్, దుర్గారావు, పంతులు, చిన్నపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.