మేడారం మహాజాతర విజయవంతానికి కృషి చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ములుగు జిల్లాలో తొలిసారి ఆదివారం పర్యటించారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మహాజాతరపై మేడారంలోని ఐటీడీఏ క్యాంపు ఆఫీస్లో మానుకోట ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్పర్సన్ నాగజ్యోతి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఎస్పీ గౌష్ఆలంతో సమీక్షించారు. భక్తులకు సౌకర్యాలు కల్పించే పనులకు రూ.75కోట్లు మంజూరు కాగా, రెండు రోజుల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు మంత్రి సీతక్క మేడారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. ఎత్తుబెల్లం సమర్పించి మొక్కులు చెల్లించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని ప్రారంభించారు.
తాడ్వాయి, డిసెంబర్ 17: ఆదివాసీ గిరిజనుల ఇలవేల్పులైన మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర విజయవంతానికి, జాతరకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని మేడారంలో ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్పర్సన్ నాగజ్యోతి, కలెక్టర్ ఇలాత్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఎస్పీ గౌష్ఆలంతో కలిసి ఆదివారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చే మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆమోదించిన పనులకు రూ.75కోట్లు మంజూరుచేసినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారని, రెండు మూడు రోజుల్లో టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అవసరమైతే మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఇంకా నిధులను మంజూరు చేస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు పూర్తిచేయాలని, పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని అన్నారు. ఇప్పటినుంచే మేడారానికి భక్తులు వస్తున్నందున అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, అభివృద్ధి పనుల నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎంపీపీ గొంది వాణిశ్రీ, సర్పంచ్ బాబురావు, అధికారులు ఉన్నారు.
మేడారం సమ్మక్క, సారలమ్మలను ఆదివారం మంత్రి దనసరి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి వేర్వేరుగా దర్శించుకున్నారు. మంత్రికి జిల్లా అధికార యంత్రాంగం, అమ్మవార్ల పూజారులు, దేవాదాయశాఖ అధికారులు డోలివాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి సీతక్క అమ్మవార్లకు తులాభారం వేయించి ఎత్తుబెల్లం సమర్పించారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించారు.