హనుమకొండ, మార్చి 21: అత్యున్నతమైన గవర్నర్ వ్యవస్థకు కళంకం తీసుకురావొద్దని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల సందర్భంగా తెలంగాణ యువతకు దక్కాల్సిన అవకాశాలపై చేసిన వ్యాఖ్యలపై మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సోమవారం రాజ్భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల నేపథ్యంలో యువత విషయంలో ప్రస్తావించిన అంశాలపై మంత్రి ఘాటుగా స్పందించారు. యువకుల బలిదానంతోనే తెలంగాణ సాధ్యమైందని, యువకులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, త్వరలోనే తెలంగాణలోని యువతకు మంచి రోజులు రాబోతున్నాయని అనడం బాధాకరమన్నారు. కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక విధానాలతోనే యువతకు అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. రాజ్భవన్ తలుపులు ఎపుడూ తెరిచి ఉంటాయని, ప్రతి తెలంగాణ బిడ్డకు అండగా నిలుస్తానన్న గవర్నర్ ఏమి చేసిందని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థ కూడా కేంద్ర రాజ్యాంగ వ్యవస్థగానే మారిందన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్రంలో బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలను సాధించుకున్నామని, ఆ దిశలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందకు సాగుతుందన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా ఏనాడైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చిందా..?’ అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో ఐటీ రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రైవేట్ రంగంలో 22లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.
‘సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎనిమిది ఏళ్లలో కనీసం 16 ఉద్యోగాలైనా ఇచ్చిందా..?’ అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, విద్యా సంస్థల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎందుకు తీసుకురాలేదన్నారు. ఐటీఐఆర్ రద్దు చేసి యువతకు నష్టం చేసిందన్నారు. తెలంగాణకు అన్యాయం, ద్రోహం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కాదా..? అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంతో పాటు రిజర్వేషన్లకు ఎసరు పెట్టిందన్నారు. విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీ విషయంలో ఎందుకు గవర్నర్ మాట్లాడడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు అన్ని విషయాల్లో అండగా నిలువాల్సిన గవర్నర్ యువకులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. జీవో 3తో గిరిజన యువకులు నష్టపోయారన్నారు.
రాజ్భవన్ యువతకు అండగా ఉంటుందన్న గవర్నర్.. ఏవిధంగా ఉంటుందో చెప్పాలని మంత్రి సత్యవతిరాథోడ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు నచ్చని పార్టీలపై ఈడీ, ఐటీ వంటి రాజ్యాంగ సంస్థలను ఉసి గొల్పుతున్నదని, గవర్నర్, రాజ్భవన్లను ఏజెన్సీలుగా నియమించుకున్నదన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని, రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపారన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ ఆదేశాల మేరకే పనిచేస్తున్నాయని, కేవలం అభియోగాల నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవితను విచారణ పేరుతో అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల కుటుంబ సభ్యులకు అండగా, రక్షణ కవచంలా ఉంటుందని మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణ ప్రభుత్వంపై వివక్ష, సవతితల్లి ప్రేమను చూపుతున్నదని విమర్శించారు. సమావేశంలో వరంగల్ జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, మాజీ ఎంపీ సీతారాంనాయక్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.