మహబూబాబాద్, జూన్ 22 : తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ సెంటర్లో అమరుల స్తూపం వద్ద మంత్రి సత్యవతి, జడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, కలెక్టర్ కే శశాంక, అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్తో కలిసి నివాళులర్పించారు. అనంతరం జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ బిందు అధ్యక్షతన నిర్వహించిన అమరుల సంస్మరణ సభలో మంత్రి మాట్లాడారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లో అమరుల సంస్మరణ సభలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాకో ప్రత్యేకత ఉన్నదని, స్వరాష్ట్ర ఉద్యమంలో ఇక్కడి ప్రజలు పోషించిన పాత్రను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటారని తెలిపారు. మానుకోట రాళ్ల చరిత్ర తెలంగాణ పుస్తకంలో ఓ పేజీలో లిఖించబడిందని గుర్తు చేశారు. అమరుల త్యాగాలకు గుర్తుగా హైదరాబాద్ నడిబొడ్డున సచివాలయం ఎదురుగా తెలంగాణ అమరుల స్మారక భవనాన్ని నిర్మించి సీఎం కేసీఆర్ ప్రారంభించారని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తి చేసుకొని ముందుకు సాగుతున్నామని వివరించారు.
నాడు 10 జిల్లాలున్న తెలంగాణను నేడు 33 జిల్లాలను చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, తండాలను మున్సిపాలిటీలుగా మార్చుకొని రాష్ట్రమంతా అభివృద్ధి పథాన నడిపిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యమంలో పాల్గొన్న అందరినీ ప్రభుత్వం గౌరవిస్తున్నదని చెప్పారు. దివ్యాంగులకు రూ.4016, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృత్తి దారులకు రూ.2016 అందిస్తున్నదన్నారు. నిరుపేదల ఇళ్లల్లో పెళ్లి కోసం రూ.లక్ష, ప్రసవం జరిగితే రూ.12వేలు అందించి ప్రభుత్వం ఆదుకుంటున్నదని పేర్కొన్నారు.
పేదల సంక్షేమం కోసం సర్కారు కృషి చేస్తున్నదని, పారిశుధ్య కార్మికుల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు పీఆర్సీలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. అమరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించామన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాపీ కొట్టి ఇక్కడి పథకాలను ఇతర రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. స్వయంగా ఉద్యమకారుడు కేసీఆర్ సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా ప్రజలు మళ్లీ కేసీఆర్ను సీఎంను చేయాలని కోరారు. ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ.. చావు నోట్లో తలపెట్టి సాధించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అన్నం పెట్టే రైతులను ఆదుకుంటున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అమరుల కుటుంబాలకు తగిన ప్రాధాన్యమిస్తూ, ఉద్యమంలో పాల్గొని గాయపడిన ఆరుగురికి రూ.6లక్షల చొప్పున అందించామని గుర్తు చేశారు. ఇప్పుడు మాట్లాడే వారు ఏం చేశారో..? తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. 9 ఏళ్లలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ మారిందన్నారు. ‘మా తండాల్లో మా పాలన’ కావాలని కాంక్షించిన వారికి గ్రామ పంచాయతీలను చేసి స్వయంగా పాలించుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారని వివరించారు.
గిరిజనులకు రిజర్వేషన్ 6 నుంచి 10 శాతం పెంచారని, ఇటీవల ప్రతి గ్రామానికి రూ.25 లక్షలను అభివృద్ధి కోసం మంజూరు చేశారని చెప్పారు. త్యాగాల ఫలితాలపై ఏర్పడిన తెలంగాణలో సంక్షేమం, అభివృద్ది సమపాళ్లలో సాగుతుందన్నారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. ప్రాణత్యాగాలు ఎంతో విలువైనవని, అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదరిస్తున్నారని చెప్పారు. అమరుల ఆశయాలను నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబంపై మక్కువ తెంపుకొని రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేశారని కొనియాడారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లాలో మృతి చెందిన 13 మందిలో 11 మంది కుటుంబ సభ్యులు హాజరుకాగా, వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) అభిలాషా అభివన్, ఎం.డేవిడ్, ట్రైనీ కలెక్టర్ పింకేశ్కుమార్, జడ్పీ సీఈవో రమాదేవి, డీపీవో నర్మద, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహబూబ్పాషా, జడ్పీటీసీలు బండి వెం కట్రెడ్డి, సుచిత్ర, ప్రియాంక, మంగళంపల్లి శ్రీనివాస్, ఎంపీపీ భూక్యా మౌనిక, సుజాత, వైస్ ఎంపీపీ ఎల్ది మల్లయ్య పాల్గొన్నారు.