రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది
గిరిజనులకు మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత భరోసా
బయ్యారం ఏజెన్సీలోని మసివాగు, పందిపంపుల వాగు ఉధృతి పరిశీలన
సమస్యలు తెలుసుకొని జాగ్రత్తలు చెప్పిన మంత్రి
వర్షాలు తగ్గేవరకూ అప్రమత్తంగా ఉండాలని సూచన
బయ్యారం, జూలై 12 : వర్షాలతో ఆందోళన వద్దు.. అండగా మేమున్నామని వరద ప్రభావిత ఏజెన్సీ ప్రాంత ప్రజలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని.. మీకు కష్ట్రం రానివ్వకుండా కాపాడుకుంటామని వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు. మంగళవారం ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి బయ్యారం మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో ఆమె పర్యటించారు. తొలుత గంధంపల్లి, కోటగడ్డ గ్రామాల మధ్యలో ఉన్న అలిగేరు వాగును, ఆ తర్వాత సుద్దరేవు, పాత కంబాలపల్లి మధ్య ఉన్న పెద్దవాగు, పందిపంపుల, మసివాగుల ఉధృతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలతో మంత్రి, ఎంపీ మాట్లాడారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుందని ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటామని ధైర్యం చెప్పారు. వర్షాలతో వాగులు ప్రవహిస్తున్న కారణంగా చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే విద్యుత్తో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. గర్భిణులకు ఇబ్బంది కలుగకుండా దగ్గర్లోని వైద్యశాలలో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బంది తలెత్తితే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్కు కాల్ చేస్తే తక్షణమే సహాయక చర్యలు అందుతాయని తెలిపారు. ఈ సందర్భంగా కిష్టాపురం, పెద్దవాగుపై వంతెన లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పగా హైలెవల్ వంతెన ఏర్పాటుచేసేలా చూస్తామని మంత్రి తెలిపారు. వారి వెంట ఆర్డీవో కొమురయ్య, సొసైటీ చైర్మన్ మూల మధుకర్రెడ్డి, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో చలపతిరావు ఉన్నారు.