రైతుల గురించి ఆలోచించే కేసీఆర్ వెంట ఉందామా?
రాబందుల్లా పీక్కుతిన్న కాంగ్రెస్ వైపు ఉందామా? ఆలోచించండి..
నాడు ‘మంచం పట్టిన మన్యం’ అని వార్తలు రాని సంవత్సరం లేదు
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న కవి దాశరథి మాటలను నిజం చేసిన సీఎం కేసీఆర్
ప్రొఫెసర్ జయశంకర్ సార్ మార్గదర్శనంలోనే స్వరాష్ట్రం ఏర్పాటు
‘సమైక్య రాష్ట్రంలో తాగు, సాగునీరు ఇవ్వకుండా చావగొట్టింది కాంగ్రెస్ కాదా? నాడు నీళ్లకు ఎంత గోస పడ్డమో ఒక్కసారి ఆడబిడ్డలు గుర్తుచేసుకోవాలి. ఇప్పుడు వాళ్లే అడ్డం పొడుగు మాట్లాడుతున్నరు.. వేషాలేసుకొని మళ్లీ వస్తున్నరు.. వాళ్ల మాటలకు మోసపోవద్దు..’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగులో బుధవారం సాగునీటి దినోత్సవాన్ని నీటి పారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎంపీ మాలోతు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులతో నిర్వహించిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నాడు కవి దాశరథి అన్న మాటలను సీఎం కేసీఆర్ నిజం చేసినందుకే నేడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని స్పష్టం చేశారు. రైతుల గురించి ఆలోచించే కేసీఆర్ వెంట ఉందామా? రాబందుల్లా పీక్కుతిన్న కాంగ్రెస్ పక్షాన ఉందామా? ఆలోచించాలని సూచించారు.
ములుగు, జూన్ 7(నమస్తే తెలంగాణ) : నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నాడు కవి దాశరథి జైలు గోడల మీద బొగ్గులతో రాసిన రాతలను సీఎం కేసీఆర్ నేడు నిజం చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యమ నాయకుడిగా 14ఏండ్ల పాటు కేసీఆర్ ఎత్తిన జెండాను దించకుండా రాష్ర్టాన్ని సాధించి, దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో ప్రథమ స్థానంలో నిలిపారని, తెలంగాణకు కోటిన్నర ఎకరాల మాగాణంలా మార్చారని స్పష్టం చేశారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగులో బుధవారం నిర్వహించిన సాగునీటి దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి హెలికాప్టర్లో ఇక్కడికి వచ్చే క్రమంలో ఎక్కడచూసినా చెరువులు నిండు కుండలా కనిపించాయని, పచ్చని పొలాలు కనిపించాయని చెప్పారు. ఇంతటి ఎర్రటి ఎండాకాలంలో చెరువులు మత్తళ్లు దుంకుతాయని ఎన్నడైనా కలలోనైనా అనుకున్నామా? అని గుర్తుచేశారు. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ సూచనలతో కేసీఆర్ స్వరాష్ర్టాన్ని సాధించి ఎంతో అభివృద్ధి చేశారని, గోదావరి నీటిని ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా అందించి గొంతు తడిపిన కేసీఆర్ వెంట నడవాలని పిలుపునిచ్చారు. ములుగు నియోజక వర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా ఇక్కడి ప్రజలంతా మనోళ్లే, వారి బాగోగులు మన బాధ్యత అని సీఎం కేసీఆర్ తెలియజేసి నలుగురు మంత్రులను ములుగు పంపారని, నేడు రూ.133కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేలా ఆదేశించారని, అందుకే తాము ములుగుకు వచ్చామని చెప్పారు.
ములుగు రూరల్, జూన్ 7 : ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన బుధవారం 4గంటల పాటు కొనసాగింది. ఉదయం 10:45కు హెలీకాప్టర్లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలీప్యాడ్ వద్దకు మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. అక్కడి నుంచి టూరిజం శాఖ బస్సులో సమీకృత కలెక్టరేట్ నిర్మాణ స్థలికి చేరుకొని రూ.65కోట్లతో కడుతున్న కలెక్టరేట్కు, అనంతరం రూ.38.50కోట్లతో నిర్మించే జిల్లా పోలీస్ కార్యాలయానికి, రూ.10.40కోట్లతో మేడారంలో శాశ్వత నిర్మాణాలకు, రూ. 1.25కోట్లతో నిర్మించే మోడల్ బస్టాండ్, రూ.50లక్షలతో నిర్మించే సేవాలాల్ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మోడల్ పోలీస్స్టేషన్ ఆవరణకు చేరుకొని రూ.12.50కోట్లతో నిర్మించిన ఐదు పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ను పరిశీలించి ఎస్ఐ పవన్కుమార్ను చాంబర్లోని సీటులో కూర్చొబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ములుగు జీపీకి చేరుకొని రూ.2కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను, రూ.కోటితో నిర్మించిన మోడల్ శ్మశాన వాటికను ప్రారంభించారు. రూ.30లక్షలతో నిర్మించే డిజిటల్ లైబ్రరీకి, రూ.15లక్షతో నిర్మించే పౌర సంబంధాల శాఖ మీటింగ్ హాల్కు శంకుస్థాపన చేశారు. అనంతరం సాగునీటి ఉత్సవాల సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రూ.110 కోట్లను మహిళా సంఘాలకు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. మత్స్యసహకార సంఘాలకు చెక్కులు అందించారు. ఇండ్ల పట్టాలు, గొర్రెలను పంపిణీ చేశారు. కేటీఆర్పై సాంస్కృతిక కళాకారులు రూపొందించిన పాట సీడీని మంత్రి ఆవిష్కరించారు. సాగు నీటి రంగంలో సాధించిన ప్రగతిపై ఆ శాఖ అధికారులు ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
వెంకటాపూర్, జూన్ 7 : రామప్ప ఆలయాన్ని మంత్రి కేటీఆర్ తోటి మంత్రులతో కలిసి సందర్శించారు. వారికి అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్, సంపత్ కుమార్శర్మ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ మండపంలో ఆశీర్వచనం ఇచ్చారు. ఈవో శ్రీనివాస్, మంత్రి సత్యవతి వారిని శాలువాలతో సన్మానించి, పట్టు వస్ర్తాలు సమర్పించారు. సరిగమల పొన్నచెట్టును మంత్రి కేటీఆర్ స్వయంగా మీటారు, ముగ్గురికి నాలుగు కాళ్లు, సన్నని రంధ్రాలు, దిష్టి స్తంభం, గర్భగుడిలో వెలుతురు, ఆ రోజుల్లోనే హై హీల్స్, నీటిలో తేలే ఇటుకలు, సాండ్ బాక్స్ టెక్నాలజీ, విదేశీయులతో వ్యాపార సంబంధాలు తెలిపే శిల్పాలను గురించి తెలుసుకొని అబ్బురపడ్డారు. ప్రొఫెసర్ పాండురంగారావు నీటిలో తేలే ఇటుకల గురించి వివరించి, రామప్ప డోసియర్ను బహూకరించారు. టూరిజం గైడ్స్ తమ జీవం పెంచాలని వినతి పత్రం సమర్పించగా తప్పకుండా పెంచి పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ పురావస్తు శాఖ సీఏ మల్లేశ్, డీటీవో శివాజీ ఉన్నారు.
‘గ్రామ పంచాయతీగా ఉన్న ములుగును జిల్లా కేంద్రం చేసిన తర్వాత పంచాయతీ ఉంటే బాగుండదనే ఉద్దేశంతో మొన్నటి శాసనసభ సమావేశాల్లో ములుగును మున్సిపాలిటీగా చేయాలని బిల్లు పెట్టినం. హైదరాబాద్కు దూరంగా ఎక్కడో విసిరేసినట్లు ఉండే ములుగు ఒకప్పుడు తాలూకా కేంద్రం కావాలంటేనే గగనం. అలాంటిది ఈ రోజు జిల్లా కేంద్రమైంది. ఏం వచ్చిందని సంబురాలు చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నరు. ఏం వచ్చిందంటే ములుగు జిల్లాకు దేశస్థాయిలో జాతీయ పంచాయతీ అవార్డుల్లో 2వ ర్యాంకు వచ్చింది. కాంగ్రెస్ హయాంలో ములుగు 329 ర్యాంకులో ఉంటే ఇప్పుడు 31 ర్యాంకుకు ఎదిగింది. ములుగు జిల్లాలో కొత్తగా 67 గ్రామ పంచాయతీలైనయ్. కోయగూడేలు, లంబాడీ తండాలు పంచాయతీలుగా మారినయ్. గిరిజనబిడ్డలు వార్డుసభ్యులు, సర్పంచ్లు కాలేదా? కన్నాయిగూడెం, గంగారం కొత్త మండలాలు అయినయ్.
ములుగు, జూన్ 7(నమస్తేతెలంగాణ) : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ అభ్యర్థిగా ములుగు జడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి బరిలో ఉంటుందని స్థానిక నాయకులు చర్చించుకోవడం కనిపించింది. బుధవారం నిర్వహించిన సభలో నాగజ్యోతికి మంత్రి సత్యవతిరాథోడ్ ప్రసంగించే అవకాశాన్ని కల్పించడంతో పాటు చివరగా కేటీఆర్ సైతం పోడు భూముల సమస్యపై ‘సోదరి నాగజ్యోతి సూచించిన విధంగా సమస్యను పరిష్కరిస్తామ’ని ప్రత్యేకంగా చెప్పడంతో అభ్యర్థి ఆమెనే ఉంటుందని సభకు వచ్చిన మాట్లాడు కోవడం కనిపించింది. ఇక్కడికి వచ్చిన రాష్ట్ర నాయకులను, స్థానిక నాయకులు ములుగు అభ్యర్థిని త్వరగా నిర్ణయిస్తే మంచిదని కోరగా ‘సగం ప్రకటన వెలువడింది, మిగతా సగం త్వరలో అధిష్టానం ప్రకటిస్తుంది’ అని చెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులకు ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తున్నది.
వానకాలం వచ్చిందంటే ‘మంచం పట్టిన మన్యం’ అని కాంగ్రెస్ హయాంలో వార్తలు రాని సంవత్సరం లేదు. ఈ రోజు ఇలాంటి వార్తలు పేపర్లో కనిపిస్తున్నయా? ములుగు జిల్లాలోగాని భద్రాచలం, ఆదిలాబాద్లోగాని ఆడబిడ్డలు ఆలోచించాలి. కాంగ్రెస్ హయాంలో గవర్నమెంట్ ఆస్పత్రికి పోవాలంటే గుబులు పడేది. చందూలాల్ ఉన్నప్పుడే బ్రహ్మాండంగా హాస్పిటల్ కట్టుకున్నం. అదనంగా 200 పడకల ఆస్పత్రి, మెడికల్ కాలేజీ మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ములుగు జిల్లా అవుతుందని, మెడికల్ కాలేజీ వస్తదని కలలో అయినా అనుకున్నరా? ఒకప్పుడు జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కావాలంటేనే ధర్నాలు చేసే, దరఖాస్తులు పెట్టే రోజులు. ఇప్పుడు అడగకముందే మెడికల్ కాలేజీ మంజూరు చేసిన మహానాయకుడు సీఎం కేసీఆర్. ములుగులో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ఈ ఒక్క కారణం సరిపోదా?
ములుగులో 966 మంది రైతులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.48.30 కోట్లు అందించిన కేసీఆర్ వెంట ఉందామా? లేక రాబందుల్లా ఆరు దశాబ్దాల పాటు మనల్ని పీక్కుతిన్న కాంగ్రెప్ పక్షాన ఉందామా ఆలోచించాలి. ములుగు నియోజకవర్గంలో 40 వేల మందికి ఆసరా పింఛన్లు, 74 వేల మందికి రైతుబంధు అందుతున్నది. ఇవి ఎన్నికల హామీలు కాకపోయిన మీరు బాగుండాలని అమలు చేసినం. మీరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.
మల్లంపల్లిని మండలం చేయాలని డిమాండ్ ఉంది. ఒకవేళ నర్సంపేట వాళ్లు ఒప్పుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆ ఆనందాన్ని కూడా మీకు కలిగించే బాధ్యత నాది. 67 ఏళ్లలో ఎవ్వరూ చేయని పనిని ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారు. తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ను కడుపునిండా.. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి’ అని సభికులను కోరారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగు నియోజకవర్గంలో 17 వేల ఎకరాలకు పోడు భూముల పట్టాలు కూడా మంత్రి చేతుల మీదుగా అందుతాయని కేటీఆర్ వివరించారు. ‘మీకు ఎన్నికల్లో మాట ఇచ్చినప్పుడు నాడు ఉన్న అభ్యర్థిని మీరు పోగొట్టుకున్నారు. ఈసారి భవిష్యత్లో మీకు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.
రామప్ప ఆలయ ఆవరణలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, స్వప్న దంపతుల కూతురు ధర్మిష్టరెడ్డి ఆరో పుట్టిన రోజు వేడుక నిర్వహించగా మంత్రి కేటీఆర్ బర్త్డే కేక్ తినిపించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు వడ్ల గొలుసుతో చేసిన పూలమాలను కేటీఆర్కు బహూకరించారు.
ములుగుటౌన్, జూన్ 7: రామప్ప సరస్సును రిజర్వాయర్గా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి కేటీఆర్ అన్నారు. సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవాదుల ఎత్తిపోతల ద్వారా రామప్ప సరస్సులోకి చేరిన గోదావరి జలాలకు పూజలు చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రైతులకు సాగు నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారన్నారు. రామప్పలోని ఐలాండ్ను అభివృద్ధి చేసి హట్స్ నిర్మించాలని ఎమ్మెల్సీ పోచంపల్లికి సూచించారు.