కులం, మతం, రాజకీయ చిచ్చు కాదు చిచ్చరపిడుగుల్లా ఎదుగుదాం
ఇన్నోవేషన్ మీద దృష్టి పెట్టండి
ప్రతిభావంతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
టాలెంట్ ఉంటే మన వద్దకే ఉద్యోగాలు
తెలంగాణ అత్యంత ప్రామాణికమైన స్టార్టప్ స్టేట్
హెచ్ఐసీసీ తరహాలో వరంగల్లో ఫైవ్స్టార్ హోటల్ కన్వెన్షన్
సాఫ్ట్పాత్ సిస్టమ్స్ తొలి వార్షికోత్సవంలో ఐటీ మంత్రి కేటీఆర్
సుబేదారి, మే 7 : కులం, మతం, రాజకీయాలు, చిచ్చులలో కొట్టుకుపోకుండా కసితో చిచ్చరపిడుగుల్లా ఎదగాలని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. పకనున్న పేద దేశాలతో కాకుండా ఇప్పటినుంచి ప్రపంచంతో పోటీపడదామని సూచించారు. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల సీవోలంతా మనవాళ్లేనని, మరి మనమెందుకు ఆ స్థాయి కంపెనీలను స్థాపించలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. మేధస్సుకు పదను పెడదామని, కసిగా సాధించుకుందామని పిలుపునిచ్చారు. హనుమకొండలో జరిగిన సాఫ్ట్పాత్ సిస్టమ్స్ తొలి వార్షికోత్సవంలో ఆ కంపెనీ ఉద్యోగులతో మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్టి మాట్లాడారు. ‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయ్యింది. మన దేశ జనాభా 138 కోట్లు ఉన్నా 1.38 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్న యాపిల్ స్థాయి ఒక ఐటీ కంపెనీని స్థాపించలేకపోయాం. చైనా వాళ్లని చూసి భయపడే మనం, ఆ దేశం తరహాలో జీడీపీని సాధించలేకపోతున్నాం.
1987లో ఇండియా, చైనాల జీడీపీ ఒకే తరహాలో 470 మిలియన్ డాలర్లు. ఇప్పుడు మన జీడీపీ మూడు ట్రిలియన్ డాలర్లు, చైనా జీడీపీ 16 ట్రిలియన్ డాలర్లు. 25 ఏండ్లపాటు డబుల్ డిజిట్ జీడీపీతో చైనా కొనసాగుతున్నది. ఇప్పటికైనా ప్రపంచంతో పోటీపడదాం. దేశంలోనే అత్యంత ప్రామాణికమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ. ప్రతిభావంతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉన్న వాటితో పనిచేయడం కాదు. ఇన్నోవేషన్పై దృష్టిసారించాలి. అందుకు తగిన ప్రతిభ మనలోనే ఉన్నది. అయితే ఆ దిశగా ఆలోచించడం లేదు. ప్రతిభావంతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది. సీఎం కేసీఆర్ చెప్పినట్లు ప్రతిభ ఉన్న వాళ్ల వద్ద కే ఉద్యోగాలు వచ్చేలా చూసే బాధ్యత మాది. మన తెలంగాణలో ప్రపంచంలో ఎకడాలేని విధంగా ఏర్పాటుచేసిన టీహబ్, వీహబ్, టాస్లను వినియోగించుకోండి. కొత్త ఆలోచనలతో రండి. వాటిని సాకారం చేసుకోండి.
వరంగల్లో త్వరలోనే 5 స్టార్ హోటల్ కన్వెన్షన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటికే సయంట్, జెన్ప్యాక్ వంటి కంపెనీలు వస్తున్నాయి. ఇంకా సదుపాయాలు కల్పిస్తాం. ఇకడే కొత్త కంపెనీల్లో మన కొత్తతరం పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు కల్పిస్తాం. సాఫ్ట్పాత్ దారిలో మరిన్ని కంపెనీలు రావాలి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తలపెట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి సాఫ్ట్పాత్ సిస్టెమ్స్ కంపెనీ రూ.20 లక్షలను విరాళంగా ఇచ్చింది. సంస్థ అధినేత రవిచందర్ ఈమేరకు మంత్రి కేటీఆర్కు చెక్కును అందజేశారు.