భూపాలపల్లి రూరల్/ ములుగు టౌన్, డిసెంబర్ 6 : రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జనవరి 18 నుంచి అమలు చేయనున్న కంటి వెలుగు కార్యక్రమంపై మంగళవారం మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తుందన్నారు. అధికారులు సీరియస్గా తీసుకొని జిల్లాల్లో విజయవంతం చేయాలన్నారు.
కార్యక్రమాన్ని వంద పనిదినాల్లో పూర్తి చేయాలన్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కంటి వెలుగుపై విస్తృత ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు కృష్ణఆదిత్య, భవేశ్మిశ్రా, జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, డీఎంహెచ్వోలు శ్రీరామ్, అప్పయ్య, ములుగు డీఆర్డీవో నాగపద్మజ, డీఆర్వో రమాదేవి, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలి
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేలా కృషి చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా టీములు ఏర్పాటు చేసి కట్టెల పొయ్యిల ద్వారా కంటికి ఇబ్బందులు ఉండే వారిని, హోటల్లో పనిచేసే వారు, డయాబెటిస్ ఉన్న వారికి ముందుగా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్స్తో పాటు ఏఎన్ఎంలు మెడికల్ సిబ్బందికి కావాల్సిన స్టేషనరీ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, జీపీ సిబ్బందితో పాటు బీఎల్వోలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. 18 నుంచి 45 ఏండ్లు పైబడిన వారికి ఓటర్ లిస్ట్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.